తెలంగాణ బీజేపీ నాయకులు చేతకాని దద్దమ్మలని, వారి మాట విని ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మొట్ట మొదటి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర రైతు బంధు చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డితో కలిసి దయాకర్రావు ప్రారంభించారు. రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దయాకర్రావు మాట్లాడుతూ, గోదావరి నీళ్లను మన ఇండ్లకు, పొలాలకు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. నీల్లకోసం ఏళ్లుగా అలమటిస్తున్నా కాంగ్రెస్, బీజేపీ నాయకులు పట్టించుకున్న పాపానపోలేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో పంటలకు సరిపడా నీటితోపాటు వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నదని సీఎం కేసీఆర్ కాదా? అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. మన రాష్ట్రంలో అమలుచేస్తున్న పథకాలు వేరే రాష్ట్రంలో ఉన్నాయా? అని అడిగారు. అన్నదాతల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని తెలిపారు. అందుకే రూ. 3 వేల కోట్ల నష్టం వస్తున్నా వరిధాన్యం కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. క్వింటాల్ వడ్లకు రూ. 600 నష్టం వస్తున్నా రాష్ట్ర సర్కారు భరిస్తున్నదని పేర్కొన్నారు. ‘సీఎం కేసీఆర్ను పట్టించుకోకండి.. కేంద్రంతో ధాన్యం కొనిపిస్తా’మన్న బీజేపీ నాయకులు ముఖం చాటేశారన్నారు. ఇప్పుడేమో తామే కేసీఆర్తో ధాన్యం కొనిపిస్తున్నామంటూ అబద్ధాలు చెబుతూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేస్తామని, ప్రతి గింజా కొనుగోలు చేస్తామని చెప్పారు. త్వరలోనే అభయ హస్తం నిధులు తిరిగి వడ్డీతోపాటు ఇచ్చి, పెన్షన్లు కూడా ఇస్తామన్నారు.
బండి సంజయ్.. కేంద్ర మీద కొట్లాడు: పల్లా రాజేశ్వర్రెడ్డి
బండి సంజయ్కి చీము, నెత్తురుంటే ఆత్మగౌరవం లేని మాటలు బంద్చేయాలని, దమ్ముంటే ధాన్యం కొనుగోలుకోసం కేంద్రం మీద కొట్లాడాలని పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. గుజరాత్లో ఆరుగంటల కరెంట్ ఇవ్వలేని దద్దమ్మలు బీజేపీ నాయకులని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ చెప్పిన మొదటి రోజే సమీక్షించి, రెండో రోజే వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. ఇంత తక్కువ టైంలో రెడీ చేసిన అధికారులకు అభినందనలు తెలుపుతున్నానన్నారు.
ఏ రాష్ట్రంలో పండిన ధాన్యాన్నైనా కొనే బాధ్యత కేంద్రానిదేనని, ఎఫ్సీఐ ద్వారా కొనుగోలు సాగుతుందని పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. అయితే, తెలంగాణ విషయంలో కేంద్రం చేతులెత్తేసిందని మండిపడ్డారు. సీఎం స్వయంగా కేంద్రానికి లేఖరాసినా, మంత్రలు వెళ్లి కలిసినా కేంద్రం కనికరించలేదన్నారు. చివరకు నష్టం వచ్చినా సరే తెలంగాణలో పండిన ప్రతి ధాన్యం గింజనూ కొనాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు.
కాంగ్రెస్ నాయకులకు సిగ్గులేదని, రాహుల్గాంధీని బీజేపీ నాయకులు తిడుతున్నా అడ్డుకునే శక్తి లేదని పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. పదవులు రాగానే పెదవులు మూసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆర్డీఎస్ మీద మాట్లాడే హక్కు డీకే అరుణకు లేదని మండిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లాలో ప్రాజెక్టులను కాంగ్రెస్ పెండింగులో పెట్టిందని, బీజేపీ సహాయ నిరాకరణ చేసిందని చెప్పారు. కానీ, సీఎం కెసీఆర్ ఆ ప్రాజెక్టులను పూర్తి చేశారని రాజేశ్వర్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, అదనపు కలెక్టర్లు భాస్కర్రావు, హమీద్, ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.