హైదరాబాద్ : త్యాగం, సహనం, ఐక్యమతానికి బక్రీద్ ప్రతీక అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం బక్రీద్ను పురస్కరించుకుని మంత్రి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరిపై అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ గొప్పతనమని, కుల, మతాలకతీతంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని మంత్రి ఆకాంక్షించారు.
రాష్ట్రంలో మైనార్టీ కుటుంబాల సంక్షేమానికి 2008 నుండి 2014 మధ్యకాలంలో రూ. 812 కోట్లు ఖర్చు చేస్తే, గత ఏడేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం రూ. 5,900 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. పేదింటి ముస్లిం మహిళల వివాహం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1 లక్ష 116 ను షాదీ ముబారక్ పథకం ద్వారా సహాయంగా అందజేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇస్లామిక్ సెంటర్ కం కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి కోకాపేటలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి రూ. 40 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.
రాష్ట్రంలోని మసీదులలో ప్రార్థనలు చేసే 10 వేల మంది ఇమామ్ లకు ప్రతినెలా రూ. 5 వేల భృతి అందిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ వక్ఫ్ బోర్డు సంస్థలో నిర్మాణాలు, మరమ్మతుల కోసం రూ. 53 కోట్ల గ్రాంటును రాష్ట్ర ప్రభుత్వం అందించిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఏర్పాటు చేయడమే కాకుండా నిర్వహణకు రూ. 40 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.