వరంగల్: టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది సందర్భంగా నవంబర్ 15న వరంగల్లో నిర్వహించనున్న తెలంగాణ విజయగర్జన సభ ఏర్పాట్లకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Errabelli Dayakar Rao ) శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపనేని రమేశ్లతో కలిసి ఇవాళ స్థల పరిశీలన చేశారు. మామునూరులో స్థలాన్ని పరిశీలించారు. సభాస్థలం, పార్కింగ్ స్థలం సభకు హాజరుకాబోయే కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు సరిపోయేలా ఉందా అనే వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఇంకా ఇంతకంటే అనువైన స్థలాలు ఉన్నాయా అనే విషయాన్ని కూడా మంత్రి ఆరాతీశారు. నవంబర్ 15న జరుగబోయే సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కెసీఆర్ హాజరై మాట్లాడతారని మంత్రి తెలిపారు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 20 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా సీఎం ప్రజలనుద్దేశించి మాట్లాడుతారని, ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు నివేదిస్తారని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.