వరంగల్: సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలుచోట్ల ఆయా ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వరంగల్ ఉర్సు గుట్ట రంగలీలా మైదానంలో మహిళలతో కలిసి మంత్రి బతుకమ్మను ఎత్తుకున్నారు.
రాయపర్తి మండల కేంద్రంలో హైమాక్స్ లైట్లను ప్రారంభించారు. అనంతరం అక్కడ మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కోలాటం కూడా ఆడారు. అనంతరం తొర్రూర్ మండల కేంద్రంలోని యతి రాజారావు పార్కులో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాలలో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.
అక్కడ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మహిళల్లో పండుగ ఉత్సాహాన్ని నింపుతూ వారితో మమేకమై మంత్రి ఎర్రబెల్లి బతుకమ్మ ఆడటంతో అందరిలోనూ ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా ఆడ బిడ్డలకు సద్దుల బతుకమ్మ, దసరా – విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం ఈ బతుకమ్మ పండుగ అని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రకృతిలో లభించే తీరొక్క పూలను సేకరించి వాటిని అందంగా వలయా కృతిలో పేర్చి అమ్మవారు ఆ పార్వతీదేవికి ప్రతిరూపమైన గౌరమ్మను ప్రతిష్టించి కొలిచే అద్భుతమైన పండుగ ఈ బతుకమ్మ అని వివరించారు.
ప్రపంచంలోనే ఆడ బిడ్డలు పువ్వులను పూజించే సంస్కృతి మన రాష్ట్రంలోనే ఉందన్నారు. తెలంగాణ ఆడ బిడ్డల ఆత్మ గౌరవం ఈ బతుకమ్మ పండుగని, కల్వకుంట్ల కవిత ద్వారానే బతుకమ్మ పండుగకు ప్రపంచ ఖ్యాతి లభించిందని కొనియాడారు.
తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మ పండుగ స్ఫూర్తి గా నిలిచిందని, అందుకే సీఎం కేసీఆర్ ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్ణయించి నిర్వహిస్తున్నారని చెప్పారు. ఆడ బిడ్డలకు సీఎం కేసీఅర్ పండుగ కానుకగా బతుకమ్మ చీరలు ఇచ్చారని గుర్తుచేశారు.
కరోనా మహమ్మారి నుండి అందర్నీ రక్షించాలని దేవుడిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రార్ధించారు. అందరూ సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నారు. కరోనా మహమ్మారి దృష్ట్యా మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ ఈ పండుగలు జరుపుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమాల్లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, స్థానిక కార్పొరేటర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, మహిళలు ప్రజలు పాల్గొన్నారు.