పరకాల: పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ గ్రామంలో 52 రెండు పడక గదుల ఇండ్లను ప్రారంభించి, లబ్దిదారులకు దసరా పర్వదిన కానుకగా రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి వరంగల్ జిల్లా, పరకాల నియోజకవర్గ ప్రజలకు, డబుల్ బెడ్రూం ఇండ్లను పొందుతున్న లబ్ధిదారులకు ప్రత్యేకంగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలంగాణలోని నిరు పేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా డబల్ బెడ్రూం ఇండ్లు నిర్మించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందని ఆయన చెప్పారు.
అతిత్వరలో సొంత భూమి వున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించే పథకం కూడా ప్రారంభమవుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో మొదటగా ఎన్టీఆర్, ఇప్పుడు కేసీఆర్ మాత్రమే రైతులకు మంచి జరిగే పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.
నిరుపేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా డబుల్ బెడ్రూం ఇండ్లు ఉండాలని సీఎం కేసీఆర్ భావించినట్లు వివరించారు. ఈ దసరా పండుగ కానుకగా అర్హులైన నిరుపేదలకు ఈ డబుల్ బెడ్రూం ఇండ్లను అంకితం చేస్తున్నాముని చెప్పారు.
కరోనా కష్ట కాలంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్వంతంగా అంబులెన్స్ ఇవ్వడమే కాక పరకాలలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. మన ప్రభుత్వం కట్టడి చేసినంతగ కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరోనాను కట్టడి చేయలేకపోయారన్నారు.
సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ఉమ్మడి వరంగల్ జిల్లాను అభివృద్ది చేస్తున్నామని చెప్పిన మంత్రి ఎర్రబెల్లి.. ఇందుకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతఙ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
మొత్తం గూడెప్పాడ్లో 92 ఇండ్లు మంజూరు అయ్యాయని, ప్రస్తుతం 52 ఇండ్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. మిగతావి కూడా త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.
రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని, ప్రతి పేదింటి అమ్మాయి పెండ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో లక్ష 116 రూపాయల ఆర్థిక సాయం కేసీఆర్ ప్రభుత్వం అందిస్తోందని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందచేసిన సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.