పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లలెక్కింపులో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు విజయంవైపు దూసుకుపోతున్నారు. నల్లగొండ- వరంగల్- ఖమ్మం స్థానంలో పల్లా రాజేశ్వర్రెడ్డి, హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ నియోజకవర్గంలో సురభి వాణీదేవి తమ ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. బుధవారం ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ ఇంకా కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్యం ఓట్లలో విజేత తేలకపోవటంతో ఎలిమినేషన్ ప్రక్రియను కొనసాగిస్తూ రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తున్నారు.
హైదరాబాద్, నల్లగొండ ప్రతినిధి, మార్చి19 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ స్థానంలో తొలి ప్రాధాన్య ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి తన సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యం సాధించారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు నల్లగొండ స్థానంలో 62 మంది అభ్యర్థులను ఎలిమిట్చేసి వారికి వచ్చిన ఓట్లను మిగతా అభ్యర్థులుకు కలిపారు. వీటిలో పల్లాకు 972, తీన్మార్ మల్లన్నకు 828, కోదండరామ్కు 1,054 ఎలిమినేషన్ ఓట్లు వచ్చాయి.
పల్లాకు 1,10,840 మొదటి ప్రాధాన్య ఓట్లు
ఏడు రౌండ్లపాటు కొనసాగిన మొదటి ప్రాధాన్య ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డికి 1,10,840 ఓట్లు వచ్చాయి. ఆయన సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్న 83,290 ఓట్లురాగా, మూడోస్థానంలో ఉన్న కోదండరామ్కు 70,072 ఓట్లు పోలయ్యాయి. ఈ నెల 14న జరిగిన ఓటింగ్లో నల్లగొండ స్థానంలో మొత్తం 3,87,969 మంది ఓట్లు వేశారు. కౌంటింగ్ సందర్భంగా వీటిలో 21,636 చెల్లనివిగా గుర్తించారు. 3,66,333 చెల్లిన ఓట్ల నుంచి గెలుపుకోటాను ఖరారు చేశారు. చెల్లిన ఓట్లలో 50 శాతం+1 ఓటును కలుపుకొని 1,83,168 ఓట్లను మ్యాజిక్ ఫిగర్గా నిర్ధారించారు. తొలి ప్రాధాన్య ఓట్లలో ఏ అభ్యర్థికీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఎలిమినేషన్ అనివార్యమైంది. పోటీలో ఉన్న మొత్తం 71 మంది అభ్యర్థుల్లో 62 మంది స్వతంత్ర అభ్యర్థులకు కలిపి 5,966 ప్రథమ ప్రాధాన్య ఓట్లు మాత్రమే వచ్చాయి. కేవలం ఎనిమిది ఓట్లు మాత్రమే సాధించి చివరిస్థానంలో నిలిచిన ఎం వెంకట్రెడ్డి అనే అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ రౌండ్ను ప్రారంభించారు.
వాణీదేవి ఆధిక్యం
హైదరాబాద్ స్థానంలో ఓట్లలెక్కింపు ఉత్కంఠ రేపుతున్నది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి 1,12,689 ఓట్లు, సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి ఎన్ రాంచందర్రావుకు 1,04,668 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ఫ్రొఫెసర్ నాగేశ్వర్కు 53,610 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,554 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యంలో వాణీదేవి 8,021 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 3,58,351 ఓట్లు పోలవ్వగా, కౌంటింగ్లో 21,309 చెల్లని ఓట్లుగా తేల్చారు. చెల్లుబాటైన 3,37,042 ఓట్లలో 50శాతం+1 ఓటు కలుపుకొని 1,68,521 ఓట్లు మ్యాజిక్ ఫిగర్గా నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యంలో ఎవరూ మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవటంతో శుక్రవారం ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. 54 మంది అభ్యుర్థుల ఎలిమినేషన్ ముగిసేసరికి టీఆర్ఎస్కు 232, బీజేపీకి 217, నాగేశ్వర్ 137, కాంగ్రెస్ 115 రెండో ప్రాధాన్య ఓట్లు వచ్చాయి. మొత్తంగా వాణిదేవికి 1,12,921, రాంచందర్రావుకు 1,04,885, నాగేశ్వర్ 53,747 ఓట్లు లభించాయి.