సూర్యాపేట సిటీ, మే 17 : కరోనాతో ఒక వైపు ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. మరో వైపు కొన్ని దవాఖానలు, అందులో పనిచేసే కొంత మంది వ్యక్తులు మెడికల్ బ్లాక్ దందాకు పాల్పడుతున్నారు. కొవిడ్ చికిత్సలో కీలకంగా ఉపయోగించే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో 30 నుంచి రూ.35వేలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్లో అమ్ముతున్న ముఠాను సీసీఎస్, సూర్యాపేట పట్టణ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి సోమవారం పట్టుకున్నారు. వారి నుంచి 30 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట డీఎస్పీ మోహన్కుమార్ సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆరంజ్ దవాఖాన మేనేజర్గా పనిచేస్తున్న నరేశ్, సంజీవని ఆసుపత్రి మేనేజర్ నర్సింహరాజు రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్లో విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో పట్టణ ఎస్ఐలు శ్రీనివాస్, నరేందర్రెడ్డి, తమ బృందాలతో సోమవారం దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.
వారిని విచారించగా ఆత్మకూర్(ఎస్) మండలానికి చెందిన ఆర్ఎంపీ మాధవరెడ్డి, పందిరి కార్తీక్రెడ్డి, పెన్పహాడ్ మండలం భక్తలాపురం గ్రామానికి చెందిన గోపాల్దాస్ పవన్కళ్యాణ్, నడిగూడెం మండలం రత్నపురం గ్రామానికి చెందిన జల్లి సైదాబాబు అలియాస్ మనోహర్, నిమ్మలపంగ రమేశ్, కర్నూలు జిల్లా ఎర్రగుండపాలెం మండలం పాములపహాడ్కు చెందిన సుగునావత్ వినోద్కుమార్నాయక్, నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చెనిమినేనిపల్లికి చెందిన మద్దిమడుగు రమేశ్, త్రిపురారం మండలం పలుగుతండాకు చెందిన రంగ, సూర్యాపేట పట్టణం విద్యానగర్కు చెందిన మద్దెల నర్సింహరాజు, నూతనకల్ మండలం మాచినపల్లి గ్రామానికి చెందిన నిమ్మనగోటి శ్రీను, పెన్పహాడ్ మండలం భక్తళాపురం గ్రామానికి చెందిన గోపాల్దాస్ సాయి కూడా ఉన్నట్లు తెలిపారు.
సూర్యాపేట శివారులోని సెవెన్ స్టార్ హోటల్లో గది అద్దెకు తీసుకొని ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 30 ఇంజెక్షన్లు, ఒక కారు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు గ్రామంలోని ఆర్ఎంపీల ద్వారా రెమ్డెసివిర్ ఇంజెక్షన్ అవసరమున్న రోగులను గుర్తించి వారికి ఒక్కో ఇంజెక్షన్ రూ.30 నుంచి 35వేల రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వాటిని డ్రగ్ ఇన్స్పెక్టర్ ద్వారా పంచనామా నిర్వహించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోపాల్దాస్ సాయి పరారీలో ఉండగా, మిగతా వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ముఠా గుట్టు రట్టు చేసిన సీఐ ఆంజనేయులు, ఎస్ఐలు శ్రీనివాస్, నరేందర్రెడ్డి, సిబ్బంది అంజయ్య, కృష్ణయ్య, సైదులు, కరుణాకర్, సీసీఎస్ సిబ్బందిని డీఎస్పీ మోహన్కుమార్ అభినందించారు.