కరోనా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో మరోసారి మూలికావైద్యం ప్రాముఖ్యతను సంతరించుకొంటున్నది. మూలికావైద్యంతో మొండి రోగాలు కూడా నయం అవుతుందనేది కొందరి నమ్మకం. ముఖ్యంగా పచ్చకామెర్లు, పాము, తేలు కాటు, ఎముకలు విరిగిన వారితోపాటు దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, చర్మవ్యాధులకు మొక్కల నుంచి తయారుచేసిన మందులు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని విశ్వసిస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఏండ్లుగా మూలికావైద్యం చేస్తున్న పలువురి వద్దకు స్థానిక ప్రజలతోపాటు ఇతర రాష్ర్టాలవారు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
కొత్తగూడెం పట్టణానికి సమీపంలో ఉన్న రామవరం వాసి రావి వెంకటయ్య మూలిక వైద్యంలో సిద్ధహస్తుడు. అనారోగ్యంతో బాధపడుతున్న వందలాది మందికి మూలికా వైద్యంతో నయం చేస్తున్నారు. స్వయంగా తన ఇంట్లో పెంచుతున్న ఔషధ మొక్కల నుంచి కషాయాలు తయారుచేసి అనారోగ్యంతో ఉన్నవారికి ఇస్తున్నారు. ముఖ్యంగా తిప్పతీగ, ఉసిరి, కొండపిండి, నేలవాము ఆకుల ద్వారా కషాలను తయారు చేసి వివిధ వ్యాధులకు అందజేస్తున్నారు. తిప్ప తీగ కషాయాన్ని జ్వరం, షుగర్, నొప్పుల నివారణకు పంపిణీ చేస్తున్నారు. నేలవేము ఆకుల కషాయాన్ని మలేరియా, టైఫాయిడ్ బాధితులకు ఇస్తారు. కామెర్లు తగ్గడానికి నేలఉసిరి ఆకుల కషాయం ఇస్తారు. పల్లేరు కషాయాన్ని రక్తశుద్ధికి, కొండపిండి కషాయాన్ని కిడ్నీల్లో రాళ్లు కరగడానికి, ఇతర ఆరోగ్య సమస్యలకు గోధుమ గడ్డి వినియోగిస్తారు. తన పూర్వీకుల నుంచి అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని తాను కొనసాగిస్తున్నామని చెప్తున్నారు వెంకటయ్య.
కామెర్ల వ్యాధి నివారణకు మూలికలతో తయారుచేసిన మందు ఇస్తున్నారు సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం సజ్జాపురానికి చెందిన గున్రెడ్డి చెన్నారెడ్డి-జోగమ్మ దంపతులు. కొన్ని ప్రత్యేక ప్రాంతాల నుంచి సేకరించిన ఆకులను ముద్దగా నూరి వాటితో మందు తయారుచేస్తారు. పసరు లేదా పొడి రూపంలో ఇస్తున్న ఈ మందును పాలు లేదా వెన్నతో కలిపి మూడు రోజులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరు రోజుల తర్వాత వ్యాధి నయమవుతుందని చెప్తుతున్నారు. వందేండ్ల వయసున్న చెన్నారెడ్డి నేటికీ వైద్యం చేస్తున్నారు. తనతోపాటు కుమారులు, మనుమలకూ ఈ సంప్రదాయ వైద్యాన్ని నేర్పించారు. రూ.100 నుంచి రూ.200 తీసుకొని మందు ఇస్తున్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం అంజలీపురానికి చెందిన కర్లపూడి గోపయ్య కుటుంబం వందేండ్లుగా మూలికా వైద్యం చేస్తున్నది. కాళ్లు, చేతుల ఎముకలు విరిగినా, చిట్లినా, బెణికినవారికి దొండాకు పసరుతో చేసిన మందుతో కట్టు కడుతున్నారు. గాయం తీవ్రతను బట్టి రెండు నుంచి ఐదు కట్లు వేస్తారు. చికిత్సలో దొండ ఆకు పసరు, కోడిగుడ్డు సొన, ఇతర మూలికలను వాడుతున్నారు. 40 ఏండ్ల క్రితం గోపయ్య కొడుకు కోటేశ్వర్రావు హుజూర్నగర్లో వైద్యాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం కోటేశ్వర్రావు కొడుకు గణేశ్ వైద్యం చేస్తున్నాడు. వైద్యం కోసం నల్లగొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వస్తున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని కాకర్లపల్లికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు చల్లారి వెంకటేశ్వరరావు కొన్ని ఔషధ మొక్కలు, మూలికలతో ఉబ్బసం, మధుమేహం, పాము, తేలుకాటు, కీళ్ల వ్యాధులు, పక్షవాతం, మొలలు, కిడ్నీ, లివర్ వ్యాధులకు మందులు ఇస్తున్నారు. సుమారు 800 రకాల ఔషధమొక్కలతో మూలికలు తయారు చేస్తాన్నామని, కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి కావాల్సిన రోగనిరోధక శక్తి మూలికావైద్యం ద్వారా పెంచుకోవచ్చని చెబుతున్నారు. వెంకటేశ్వరరావు మూలిక వైద్యంపై శిక్షణ కూడా పొందారు.
ఎర్రి కుక్కలు, సుందె లుకలు, రక్త పింజర, విష పురుగులు కుట్టినప్పుడు శరీరంపై ఏర్పడే మచ్చలను మాన్పించేదుకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూ రు(ఎం) మండలం మొరిపిరాలకు చెందిన బోగ కిష్టయ్య కుటుంబం ఇచ్చే మూలికల మందు మంచి ఫలితాలను ఇస్తున్నది. ఔషద గుణాలున్న మొక్కల ఆకు రసాన్ని, దినుసులతో చేసిన మాత్రలను చర్మ వ్యాధులున్నవారికి ఇస్తున్నారు. మొదట కిష్టయ్య తరువాత అతని కొడుకు నర్సయ్య 50 ఏండ్లపాటు సేవలందించారు. ప్రస్తుతం నర్సయ్య అల్లుడు బింగి వెంకటేశం ఆత్మకూరు(ఎం)లో మూలికావైద్యం చేస్తున్నారు. వైద్యం కోసం ఇక్కడకు ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా వస్తున్నారు.
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దుర్గంగడ్డకు చెందిన దుర్గం బానయ్యను స్థానికులు పస్కల మందు బానయ్యగా పిలుస్తారు. పస్కల(కామెర్లు)తో తీవ్ర అనారోగ్యానికి గురైనవారు బానయ్య ఇచ్చే మందుతో కోలుకొంటున్నామని చెబుతుంటారు. అడవి నుంచి తెచ్చిన మూలికలతో చేసిన కషాయం ఇస్తాడు. కషాయం తాగిన రెండు మూడు రోజుల్లో రోగి మామూలు స్థితికి వస్తాడు.బొమ్మ నొప్పి (బొమ్మ తీపి నొప్పి), అర్షమొలలు, ముట్టు శూల నొప్పి (మహిళలకు), హైడ్రోసిల్ తదితర వ్యాధులకు సైతం బానయ్య మూలికల మందు ఇస్తారు. రాష్ట్రంతోపాటు మహారాష్ట్రలోని నాగపూర్, చాందా, ఒడిషా, ఛత్తీస్గఢ్ వాసులు ఈయన వద్దకు మందుకోసం వస్తుంటారు.
చెట్ల మందు వైద్యానికి కేరాఫ్గా నిలుస్తున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని గూడెపల్లికి చెందిన మాదారపు నర్సింగరావు. 60 ఏండ్లుగా మూలికా వైద్యాన్ని కొనసాగిస్తున్నారు. ఎలాంటి ఫీజు ఆశించకుండా మందులు ఇస్తున్నారు. ఈయన వద్దకు వైద్యానికి ఉమ్మడి వరంగల్, కరీంనగర్, హైదరాబాద్తోపాటు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు. పాము, తేలు కాటు, చర్మ వ్యాధులు, కడుపు నొప్పి వంటి వ్యాధులను నయం చేయటంలో ఆయనకు ఆయనే సాటి అని పేరున్నది.
చర్మ వ్యాధులను మూలికా వైద్యంతో నయం చేస్తున్నాడు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం వేములపల్లికి చెందిన కసానబోయిన సోమల్లు. చెట్టు బెరడును ఎండబెట్టి పొడి చేసి తాటికల్లులో కలిపి ఇచ్చే మందుతో ఎలాంటి చర్మ సమస్య అయిన నయం అవుతుందని చెబుతున్నాడు. సోరియాసిస్ వ్యాధితో వచ్చేవారికి ఫీజు తీసుకోకుండానే మందు అందిస్తున్నానని చెప్పాడు. తన తండ్రి శివలింగయ్య ద్వారా సంప్రదాయ వైద్యం నేర్చుకున్నానని 35 ఏండ్లలో ఎంతోమందికి మందు ఇచ్చానని చెప్పాడు.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అమ్రాద్కు చెందిన గణపతిరావు, విజయలక్ష్మి దంపతులు మూలికావైద్యంతో పచ్చ పసిరికలు, తెల్ల పసిరికల(కామెర్ల)ను తగ్గిస్తున్నారు. ఆవు లేదా మేక పాలలో కలిపిన మందును పంపిణీ చేస్తున్నారు. వారంలో మూడు రోజులు ఆకులతో చేసిన మందును పంపిణీ చేస్తారు. ఐదు వారాల పాటు మందు తీసుకోవడంతోపాటు పత్యం పాటించాలని సూచిస్తారు. అమ్రాద్ గ్రామస్థులకు ఉచితంగా.. ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి వచ్చే వారికి ఐదు వారాలకు రూ.100 ఫీజు తీసుకుంటారు.