హైదరాబాద్ : కరోనా టీకాల పంపిణీతో పాటు రెమిడెసివర్, ఆక్సిజన్ సరఫరా విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అయినప్పటికీ రాష్ర్టంలో రెమిడెసివర్, ఆక్సిజన్, బెడ్ల కొరత లేదని స్పష్టం చేశారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో మీడియాతో ఈటల రాజేందర్ మాట్లాడారు. రెమిడెసివర్ పంపిణీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. పది రోజుల్లో గుజరాత్కు ఒక లక్షా 63 వేలు, మహారాష్ర్టకు 2 లక్షల డోసులు, మధ్యప్రదేశ్కు 92 వేలు, ఢిల్లీకి 63 వేల డోసుల రెమిడెసివర్ ఇంజక్షన్లు పంపిణీ చేస్తే, తెలంగాణకు 25 వేల డోసులు మాత్రమే ఇచ్చిందన్నారు. కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో రెమిడెసివర్ ఇంజక్షన్ల కొరత రాకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు 2 లక్షల వయల్స్కి ఆర్డర్ పెట్టడం జరిగింది.
దేశంలో అత్యధిక కేసులు మహారాష్ర్టలో నమోదు అవుతున్నాయి. ఏపీ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, మహారాష్ర్ట నుంచి రోగులు వచ్చే అవకాశం ఉన్నందున.. రెమిడెసివర్ ఇంజక్షన్లను పెంచాలన్నారు. రోగులెవరికీ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, 4 లక్షల రెమిడెసివర్ ఇంజక్షన్లకు ఆర్డర్ ఇచ్చామన్నారు. 4 లక్షల డోసులు వస్తాయని ఆశిస్తే కేంద్రం పిడుగుపాటు వార్త అందించింది. వాక్సిన్ను తమ పరిధిలోకి తీసుకున్నట్టే రెమిడెసివర్ ఇంజక్షన్ల పంపిణీ కూడా తమ పరిధిలోనే ఉంటుందని కేంద్రం తెలిపింది. తెలంగాణకు 21వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు 21,551 వయల్స్ను మాత్రమే కేటాయించారు. దీనిపై తక్షణమే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్తో మాట్లాడాను. దీనిపై కేంద్రానికి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాం అని తెలిపారు. రాజకీయాలను పక్కన పెట్టి.. ఈ కష్టకాలంలో ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తమ రాష్ర్టంలో ఉత్పత్తి అవుతున్న రెమిడెసివర్ ఇంజక్షన్లను ప్రజల అవసరాలను తీర్చేందుకు సంపూర్ణంగా కేటాయించాలని కేంద్రానికి లేఖ రాస్తామని తెలిపారు.
ఆక్సిజన్ సరఫరా విషయంలోనూ..
కేంద్రం ఆక్సిజన్ సరఫరా విషయంలో దారుణంగా వ్యవహరిస్తోంది. ఇవాళ్టి వరకు 270 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ వాడకం జరుగుతుందన్నారు. ఒక్క రోగిని కూడా పోగొట్టుకోవద్దని, ఇతర రాష్ర్టాల నుంచి ఆక్సిజన్ను సరఫరా చేసుకుంటున్నాం. పక్క రాష్ర్టాల నుంచి ఆక్సిజన్ను సరఫరా చేయాల్సింది పోయి… 1300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా నుంచి ఆక్సిజన్ను తరలిస్తున్నారు. బళ్లారి నుంచి 20 టన్నులు, 84 టన్నుల ఆక్సిజన్ను ఒడిశా నుంచి ఇచ్చారు. తమిళనాడు నుంచి 30 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించారు. తమిళనాడు మాత్రం టన్ను కూడా ఇవ్వబోమని చెబుతోందన్నారు. తమిళనాడు తరహాలో రెమిడెసివర్ ఇంజక్షన్ల విషయంలో తాము కూడా వ్యవహరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. రాష్ర్టంలో రోజుకు 384 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందన్నారు. ప్రస్తుతానికి రాష్ర్టంలో ఆక్సిజన్ కొరత లేదు. ఒక వేళ ఆక్సిజన్ కొరత ఏర్పడితే కేంద్రానిదే బాధ్యత అని తెలిపారు. ఆక్సిజన్ నిల్వలను ఐఏఎస్ ల బృందం పర్యవేక్షిస్తోందన్నారు.
హైదరాబాద్లోని ప్రయివేటు ఆస్పత్రుల్లో ఇతర రాష్ర్టాల రోగులే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాష్ర్టానికి చెందిన రోగులే ఉన్నారు. తెలంగాణలో చికిత్స పొందుతున్న వారిలో ఇతర రాష్ర్టాల వారు 60 నుంచి 70 శాతం మంది ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కరోనా కేసులు వస్తున్నాయని తెలిపారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలకు ఆలస్యమవుతోందని తెలిపారు. రోజుకు 30 వేల ఆర్టీపీసీఆర్ పరీక్షలు మాత్రమే చేయగలం అని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే పరీక్షల సంఖ్య పెంచాల్సిందే అని చెప్పారు. కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు డబ్బు కట్టట్లేదని గాంధీ ఆస్పత్రికి పంపుతున్నాయి. గాంధీలో తొలిసారి 600 మందికి పైగా ఐసీయూలో ఉన్నారు. పరిస్థితి తీవ్రం దాల్చిన తర్వాత గాంధీకి పంపుతున్నారు. ప్రయివేటు ఆస్పత్రులు మొదట్నుంచే రోగుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. గాంధీలో ఆక్సిజన్ పడకలు ఉన్నాయి.. వెంటిలేటర్లు ఖాళీ లేవు. టిమ్స్లో వెంటిలేటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రయివేటు వైద్య కాలేజీల్లో 6 వేల పడకలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.