బన్సీలాల్పేట్/సుల్తాన్బజార్, మే 17: కరోనా బారిన పడిన తమ కుటుంబాన్ని కాపాడిన గాంధీ దవాఖానకు ఓ డాక్టర్ కృతజ్ఞతగా పీపీఈ కిట్లు, మాస్కులు అందజేశారు. సోమవారం ఐఏడీవీఎల్ తెలంగాణ శాఖ ప్రధాన కార్యదర్శి, గాంధీ దవాఖాన చర్మ వ్యాధుల నిపుణుడు డాక్టర్ కె.భూమేశ్కుమార్ తన కుమారుడు సాయిచరణ్, కోడలు సాయిశ్రీజతో కలిసి 200 పీపీఈ కిట్లు, 200 సర్జికల్ మాస్కులు, 200 ఎన్ 95 మాస్కులు, 200 డిస్పోజబుల్ గ్లోవ్స్, 200 ఫేస్ షీల్డ్స్ను గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావుకు అందజేశారు.
అనంతరం మాట్లాడుతూ ఇటీవల తమ కుటుంబ సభ్యులు కరోనా బారిన పడి గాంధీలో చేరారన్నారు. ఇక్కడి వైద్యులు మెరుగైన వైద్యసేవలు అందించడంతో త్వరగా కోలుకున్నామని వారి సేవలను కొనియాడారు. వైద్యం అందించిన డాక్టర్లు రాజారావు, ప్రభాకర్రెడ్డి, నర్సింహారావు, వినయ్ శేఖర్, త్రిలోక్, సుబోధ్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొవిడ్ రోగులకు సేవలందిస్తున్న దవాఖానలకు మరో 400పీపీఈ కిట్లు, మాస్కులు, ఫేస్షీల్డ్లు విరాళంగా అందిస్తామని చెప్పారు.
ఉస్మానియా దవాఖానకు గ్రాండ్ ఫార్మా లిమిటెడ్ అండగా నిలిచింది. సోమవారం ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ను కలిసిన ఆ కంపెనీ సభ్యులు 18 వెంటిలేటర్లను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ స్వచ్ఛంద, ఫార్మా సంస్థలు ప్రభుత్వ దవాఖానలకు చేయూతనందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో దవాఖాన సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ శేషాద్రి, ఆర్ఎంఓలు డాక్టర్ సాయిశోభ, డాక్టర్ మాధురి, డాక్టర్ బండారి శ్రీనివాసులు, డాక్టర్ కవిత, డాక్టర్ సుష్మ, డాక్టర్ సిద్దిఖీ పాల్గొన్నారు.