రామ్లాల్ దుస్థితి రాకుండా చూసుకోవాలి
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హితవు
నిర్మల్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్ రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని, రాజ్భవన్ను రాజకీయభవన్గా మార్చారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి విమర్శించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో మంత్రి ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. తమిళనాడులో బీజేపీ ఇంచార్జిగా పనిచేసిన తమిళిసై ఇక్కడ కూడా బీజేపీకి వంతపాడుతూ ఆ పార్టీ నాయకురాలిగానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
గతంలో ఎన్టీఆర్ హయాంలో ఇలాగే వ్యవహరించిన అప్పటి గవర్నర్ రామ్లాల్కు ఎదురైన పరిస్థితే తమిళిసైకి కూడా ప్రజల తిరుగుబాటు రూపంలో ఎదురవుతుందని అన్నారు. ఇకనైనా గవర్నర్ పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలకు జాతీయస్థాయి అవార్డులు వచ్చాయని.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోని పథకాలపై ఆ పార్టీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. కేసీఆర్ లాంటి నేత జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం దేశానికి ఎంతైనా ఉన్నదని చెప్పారు.