హైదరాబాద్: కొత్త పెట్టుబడిదారుల వేటలో రాష్ట్రాలు అప్పటికే పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లను మర్చిపోతుంటాయని, ఆ విషయంలో తెలంగాణ రాష్ట్రం భరోసా కల్పిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (పీఏఎఫ్ఐ) ఆధ్వర్యంలో జరిగిన 8వ జాతీయ ఫోరం 2021లో ఆయన వర్చువల్గా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పాలసీలను ఆయన వివరించారు. రాష్ట్రానికి గడిచిన ఏడేళ్లలో 32 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, వాటిలో 24 శాతం ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వారి నుంచే వచ్చాయని కేటీఆర్ తెలిపారు. పెట్టుబడులను సులభతరం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, యువ ప్రొఫెషనల్స్ను రంగంలోకి దింపిదని ఆయన వెల్లడించారు.
వీరు రాష్ట్ర పాలసీలు, మౌలిక వసతులు వంటి వివరాలను పెట్టుబడి దారులకు వివరిస్తున్నారన్నారు. ఏడేళ్ల క్రితం రాష్ట్ర ఆవిర్భావం సమయంలో ఏర్పాటు చేసిన ‘ఇన్వెస్ట్ ఇండియా’ బ్యానర్పై ఈ యువకులు పనిచేస్తున్నారని చెప్పారు. టీఎస్ఐపాస్ గురించి కూడా మంత్రి మాట్లాడారు. ఈ పాలసీ ప్రకారం సెల్ఫ్ సర్టిఫికేషన్కు ఈ విధానం అనుమతిస్తుందని, అలాగే 15 రోజుల గడువులోగా క్లియరెన్స్ ఇస్తున్నామని చెప్పారు.
ఒకవేళ ఈ గడువులోగా క్లియరెన్స్ లభించకపోతే, సదరు దరఖాస్తుకు ఆమోదం లభించినట్లేనని వివరించారు. అదే సమయంలో మానవ వనరుల అభివృద్ధిలో కూడా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక శ్రద్ధ పెడుతోందని చెప్పారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టీఏఎస్కే) కింద ప్రభుత్వమే నిధులు ఖర్చుపెట్టి యువకుల్లో నైపుణ్యాలను పెంచుతోందన్నారు.
స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించిన సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నట్లు ఆయన గుర్తుచేశారు. అనేక రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం స్వాగతం పలుకుతోందని చెప్పిన కేటీఆర్.. ప్రైవేటు రంగంలోని సంపద సృష్టికర్తలు, ఎంటర్ప్రెన్యూర్లు, ఉద్యోగాలు సృష్టించేవారికి తగిన గౌరవం లభించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు.
అలాగే వారిని కేవలం పెట్టుబడిదారులుగా చూడకుండా భాగస్వాములుగా పరిగణిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఐసీసీఐ సెక్రటరీ జనరల్ దిలీప్ చెనాయ్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ కూడా పాల్గొన్నారు.