హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు పదోన్నతుల కనీస సర్వీసును రెండేండ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఒక క్యాడర్ నుంచి మరో క్యాడర్కు పదోన్నతి పొందేందుకు ఉన్న కనీస సర్వీసును మూడేండ్ల నుంచి రెండేండ్లకు కుదించింది. అందుకోసం తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ -1996ను సవరించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సోమవారం జీవో నంబర్ 259 జారీచేశారు. ఉద్యోగుల పదోన్నతులకు గతంలో జారీచేసిన 2వ నంబర్ జీవో ప్రకారం కనీస సర్వీసు మూడేండ్లు ఉండాలన్న నిబంధన విధించారు. దీనిని సవరిస్తూ ప్రభుత్వం జీవో 259ను జారీచేసింది. 2020-21 ప్యానల్ ఇయర్కు పదోన్నతుల కనీన సర్వీసును మూడేండ్ల నుంచి రెండేండ్లకు కుదిస్తూ గతంలో ప్రభుత్వం జీవో జారీచేసింది. దాని ద్వారా 34 వేల మంది ఉద్యోగులు పదోన్నతులు పొందారు. ఈ సడలింపు 2020- 21 ప్యానల్ ఇయర్కు మాత్రమే వర్తించగా, తాజాగా ప్యానల్ ఇయర్తో సంబంధం లేకుండా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని జీవో-259లో స్పష్టంచేశారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్కుమార్, జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్రాజ్లకు టీఎన్జీవో నేతలు మామిళ్ల రాజేందర్, రాయికంటి ప్రతాప్, టీజీవో నేతలు వీ మమత, ఏ సత్యనారాయణ, ఎంబీ కృష్ణాయాదవ్, గ్రూప్ -1 అధికారుల సంఘం నేతలు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్, హన్మంత్నాయక్, పీఆర్టీయూ నేతలు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు ధన్యవాదాలు తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఇదే ఆదేశాలు కొనసాగుతాయని జీవోలో పేర్కొనడంతో ఇవి శాశ్వత ఉత్తర్వులుగా భావించవచ్చని ఉద్యోగసంఘాల నేతలు అభిప్రాయపడ్డారు.