రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది. ఆయా పంటలపై రైతులకు, ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నది. ఆయిల్పామ్ సాగుకైతే భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ ఏడాది 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేపట్టేలా రైతులను చైతన్యపరచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఆయిల్పామ్ పంట నాలుగేండ్లకు చేతికి వస్తుంది కాబట్టి.. రైతులకు పెట్టుబడి ఇబ్బందులు రాకుండా.. ప్రతి ఎకరాకు మూడేండ్లలో రూ.36 వేల సహాయాన్ని అందించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ)/న్యూఢిల్లీ: ఆయిల్పామ్ రైతులకు శుభవార్త. వరి, ఇతర పంటలకు మాదిరిగానే ఆయిల్పామ్కు కూడా మద్దతు ధర లభించనున్నది. మార్కెట్లో ధర తగ్గినా.. ధరల్లో వ్యత్యాసాన్ని చెల్లించనున్నారు. బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఆయిల్పామ్ సాగు ప్రోత్సాహంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ చేపట్టింది. ఈ ఏడాది కనీసం 20 లక్షల ఎకరాల్లో సాగయ్యేందుకు కృషి చేయాలని కూడా నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆయిల్పామ్ రైతులకు రాబోయే మూడేండ్లపాటు భారీ రాయితీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర క్యాబినెట్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ పామ్ (ఎన్ఎమ్ఈవో-వోపీ) పథకానికి శ్రీకారం చుట్టింది. ఆయిల్పామ్ సాగును విస్తృతం చేసేందుకు రానున్న ఐదేండ్లలో రూ.11,040 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో కేంద్రం వాటా రూ. 8,844 కోట్లు కాగా, రాష్ర్టాల వాటా రూ.2,196 కోట్లు. దీనిద్వారా ఆయిల్పామ్ పంటకు మద్దతు ధర, పామాయిల్ పరిశ్రమ ద్వారా రైతులకు త్వరితగతిన మొక్కల సరఫరా, పంటసాగుకు అవసరమైన ఎరువులు, ఇతర ఖర్చులకు సబ్సిడీలు సకాలంలో అందుతాయి. ఎన్ఎమ్ఈవో-వోపీ కింద ఆయిల్పామ్ సాగుదారులకు గిట్టుబాటు ధరకు హామీ ఇస్తున్నామని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ క్యాబినెట్ సమావేశం అనంతరం మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఆయిల్పామ్ సాగుదారులకు హెక్టారుకు ఇస్తున్న రూ.12 వేల సబ్సిడీని రూ.29 వేలకు పెంచుతున్నట్టు చెప్పారు. ఎన్ఎమ్ఈవో-వోపీ పథకం జాతీయ ఆహార భద్రత పథకం- ఆయిల్పామ్ ప్రోగ్రామ్లో భాగమన్నారు. 2025-26 నాటికి అదనంగా 6.5 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ను సాగులోకి తీసుకురావడమే ఈ పథకం లక్ష్యమని చెప్పారు. ప్రస్తుతం 12 రాష్ర్టాల్లో 3.70 లక్షల హెక్టార్లలో ఆయిల్పామ్ సాగవుతున్నట్టు తెలిపారు. ఆయిల్పామ్ సాగులో దేశం స్వయంసమృద్ధి సాధించేందుకు ఎన్ఎమ్ఈవో-వోపీ పథకం ఓ గేమ్ చేంజర్గా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
తెలంగాణలో పెద్దఎత్తున ప్రోత్సాహం
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యామ్నాయ పంటలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నది. ఆయిల్పామ్ సాగుకు భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ ఏడాది 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేపట్టేలా ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రైతులకు పెట్టుబడి ఇబ్బందులు రాకుండా.. ప్రతి ఎకరాకు మూడేండ్లలో రూ.36 వేల సహాయాన్ని అందించనున్నట్టు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న తాజా నిర్ణయంతో ఆయిల్పామ్ సాగుకు మహర్దశ పట్టనున్నది. ఆయిల్పామ్ పంటకు మద్దతు ధర నిర్ణయించడం వల్ల మార్కెట్లో ధర తగ్గినా, రైతులకు నష్టం లేకుండా ధరల్లోని వ్యత్యాసాన్ని కేంద్రం చెల్లిస్తుంది. ఈ మద్దతు ధరను గత ఐదేండ్ల మార్కెట్ ధరల సరళిని ఆధారంగా చేసుకొని నిర్ణయిస్తారు.
కేంద్రం నిర్ణయం హర్షణీయం
కేంద్రక్యాబినెట్ నిర్ణయాన్ని ‘ఆయిల్పామ్ డెవలపర్స్ అండ్ ప్రాసెసర్స్ అసోసియేషన్’ (ఓపీడీపీఏ) ప్రశంసించింది. ఎన్ఎంఈవో-ఓపీ పథకం ద్వారా రైతులతోపాటు ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించనున్నదంటూ ఓపీడీపీఏ అధ్యక్షుడు సంజయ్ గోయెంకా తెలిపారు. ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ సాగు రైతుకు అత్యధిక లాభదాయకమైన పంట అని చెప్పారు.