హాజరయ్యే వారికి మధ్యాహ్న భోజనం
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రత్యక్ష తరగతులకు దూరంగా ఉన్న హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థులకు విద్యనందించడలో భాగంగా పాఠశాల విద్యాశాఖ కీలకనిర్ణయం తీసుకున్నది. ఈ విద్యార్థులకు సర్కారు స్కూళ్లల్లో పాఠాలు చెప్పించడమే కాకుండా అక్కడే వారికి మధ్యాహ్న భోజనాన్ని సైతం సమకూర్చాలని నిర్ణయించింది. ఇటీవలే పాఠశాల విద్యాశాఖ అధికారులు డీఈవోలకు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. సెప్టెంబర్ 1 నుంచి రాష్టంలోని విద్యాసంస్థలు ప్రారంభంకాగా, విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో హాస్టళ్లు, గురుకులాలను తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు తెరవొద్దని హైకోర్టు ఆదేశించింది. దాంతో వీటిని ఇంకా తెరవలేదు. రాష్ట్రంలోని సంక్షేమ వసతిగృహాలు, గురుకులాలు, కేజీబీవీల్లోని పిల్లలంతా ఇంటిపట్టునే ఉంటున్నారు. పిల్లలు విద్యాపరంగా నష్టపోయే అవకాశముండటంతో సర్కారు స్కూళ్లల్లో ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యే అవకాశాన్ని కల్పించారు. ఈ విద్యార్థులు 4 లక్షల వరకు ఉంటారని అధికారులు అంచనా వేశారు. వీరంతా వారి సమీపంలోని సర్కారు స్కూళ్లల్లో తరగతులు వినే అవకాశాన్ని కల్పించాలని డీఈవోలకు ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా వీరందరికి కోడిగుడ్డు, అరటిపండులతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని సమకూర్చాలని ఆదేశించారు.