న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్లోకి తరలిపోతున్నదని ఢిల్లీ హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. రోగులకు అవసరమైన మందులను కూడా కొందరు దొడ్డిదారిన ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారని, అయినప్పటికీ, ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని మండిపడింది. కరోనా నియంత్రణ చర్యల్లో ఢిల్లీ సర్కార్ విఫలమైందని తీవ్ర స్వరంతో మందలించింది. ఆక్సిజన్ కొరతతో దవాఖానలు, నర్సింగ్ హోమ్లలో మరణించిన వారి వివరాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆక్సిజన్ రీఫిల్లింగ్ సెంటర్లపై కూడా కోర్టు ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సంక్షోభ సమయంలో రాబందుల్లా ప్రవర్తించవద్దన్నది. మరోవైపు, ఢిల్లీ హైకోర్టు జడ్జిలు, వారి కుటుంబసభ్యుల కోసం ఫైవ్ స్టార్ హోటల్ను 100 పడకల కొవిడ్ కేంద్రంగా మార్చడంపై ప్రభుత్వంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అలా మార్చాలని తాము చెప్పలేదని పేర్కొంది. ఇదిలా ఉండగా, కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులకు ఇచ్చే రెమ్డెసివిర్ ఔషధం కొరతతో వేలాది మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారని ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. దేశంలో ఎన్నో కంపెనీలు ఆ ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, లక్షల వయల్స్ విదేశాలకు ఎగుమతవుతున్నప్పటికీ, దేశ ప్రజలకు మాత్రం ఆ ఔషధం దక్కడంలేదని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.