భీమదేవరపల్లి, జూలై 5: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి సమీపంలోని దానయ్య గుట్టపై మాఫిక్ మైక్రో గ్రాన్యులర్ ఎన్క్లేవ్స్ (రంధ్రాలు) ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు. మనిషి గుండెకు రంధ్రం పడినట్టుగా గుట్ట ఉపరితలంపై రంధ్రాలు ఉన్నాయని.. భూగర్భ శాస్త్రవేత్తలకు మాత్రమే గాకుండా సామాన్యులను సైతం ఇవి ఆకర్షిస్తున్నాయని చెప్పారు. దానయ్యగుట్ట ఏటవాలులో రెండు దిగుల్ల మధ్య ఏర్పడిన ఒక రంధ్రాన్ని గుర్తించామని వెల్లడించారు. 17.5538 ఉత్తర అక్షాంశం, 79.15.25 తూర్పు రేఖాంశాల మధ్య 427 మీటర్ల ఎత్తులో ఈ రంధ్రా లు ఉన్నాయని తెలిపారు. భూగర్భశాస్త్రం ప్రకారం వీటిని మాఫిక్ మైక్రో గ్రాన్యులర్ ఎన్క్లేవ్స్ అంటారని చెప్పారు.
భూమి లోపల కిలోమీటర్ల లోతులో రెండు రకాల శిలాద్రవాల మధ్య పరస్పరం రసాయన, యాంత్రిక, ఉష్ణ మార్పులు జరగడం వల్ల మాఫిక్ మైక్రో గ్రాన్యులర్ ఎన్క్లేవ్స్ ఏర్పడుతాయన్నారు. వీటిని సంక్షిప్తంగా ఎంఎంఈగా పిలుస్తారని పేర్కొన్నారు. పక్కపక్కనే ఏర్పడిన ఎన్క్లేవ్స్ చూడటానికి పెద్ద పెద్ద దిగుళ్ల వలే కనిపిస్తాయని తెలిపారు. వీటి మధ్య ఏర్పడిన ఖాళీ ప్రాంతం గాలి తాకిడికి, నీటి ప్రవాహాల కోతకు గట్టిపడిన అతిథియ శిలాద్రవం క్రమంగా రంధ్రం పెద్దదైందని చెప్పారు. దానయ్యగుట్టపై గంటు చిత్రం (పెత్రోగ్లిప్)గా కాయోత్సర్గ భంగిమలో గీసిన జైన తీర్థాంకరుని చిత్రం, రాతిపలకలతో నిర్మించిన జైన బసది, అందమైన కోనేరు ఉన్నట్టు ఆయన వివరించారు.