హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపికకోసం టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పార్టీ పరిశీలకులను నియమించారు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల పేర్లను పార్టీ అధిష్ఠానం సీల్డ్కవర్లో పరిశీలకుల ద్వారా పంపిస్తుంది. తాజాగా ఎన్నికలు జరిగిన రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నెల 7న వీటి పాలక మండళ్ల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల సారథుల ఎన్నిక, పార్టీలో సమన్వయానికి పలువురు మంత్రులు, ముఖ్య నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. పార్టీ అందించిన సీల్డ్ కవర్లను తీసుకుని పరిశీలకులు ఒక రోజు ముందే ఆయా ప్రాంతాలకు వెళ్లాలని, ఎన్నిక జరిగే రోజు ఉదయం కార్పొరేటర్లను, కౌన్సిలర్లను సమావేశపరచి, పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లను వెల్లడించాలని సీఎం కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు నిర్వహించిన రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల పాలకమండళ్ల ఎన్నికకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదలచేసింది. 7వ తేదీన ఎన్నిక ఉంటుందని తెలిపింది. ఎన్నికైన కౌన్సిలర్లు, వార్డు సభ్యులకు ముందు రోజే సమావేశానికి ఆహ్వానం అందించాలని పేర్కొన్నది. 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అందరితో ప్రమాణం చేయించాలని, 3.30 గంటలకు పరోక్ష పద్ధతిలో మేయర్ డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించాలని తెలిపింది. ఈ సందర్భంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీచేసింది. పాలక మండళ్ల ఎన్నికలు జరిగే జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారథి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటు హక్కు ఉన్న సభ్యుల్లో సగం మందిని కోరంగా పరిగణించాలని, మొదటి రోజు కోరం లేకపోతే మరుసటిరోజు ఎన్నిక నిర్వహించాలని చెప్పారు. రెండో రోజు కూడా నిర్వహించలేని పక్షంలో ఆ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తేవాలని కోరారు. ఆ తదుపరి సమావేశంలో కోరంతో సంబంధం లేకుండా ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు. అభ్యర్థి గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ తరఫున పోటీచేసే పక్షంలో ఆ పార్టీ ప్రెసిడెంట్/ జనరల్ సెక్రటరీ నుండి అనుమతి పత్రాన్ని ప్రిసైడింగ్ అధికారికి ఎన్నిక జరిగే రోజు ఉదయం 10 గంటల లోపు సమర్పించాలన్నారు. ఎన్నిక ప్రక్రియ మొత్తాన్నీ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కవరేజీకి అనుమతించాలని, ప్రత్యక్ష ప్రసారం చేయాలని చెప్పారు. పక్కా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎన్నికైన అభ్యర్థి కోరినపక్షంలో భద్రత కల్పించాలన్నారు. ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల పరిశీలకుడు జీ కిషన్, ఖమ్మం కార్పొరేషన్ పరిశీలకుడు అహ్మద్ నదీం, జడ్చర్ల మున్సిపాలిటీ పరిశీలకుడు సుదర్శన్రెడ్డి, కొత్తూరు మున్సిపాలిటీ పరిశీలకుడు ఈ శ్రీధర్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్కుమార్, ఓఎస్డీ జయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.