ఎమ్మెల్సీ సీట్ల్లు రెండూ టీఆర్ఎస్వే
గులాబీవైపే పట్టభద్రులు, ఉద్యోగులు
సురభి వాణీదేవికి అద్భుతమైన మెజారిటీ
మరోసారి గల్లా ఎగరేసిన డాక్టర్ పల్లా
సిట్టింగ్ సీట్లో కూడా మట్టికరిచిన బీజేపీ
నల్లగొండలో 4వ స్థానానికి పరిమితం
రెండు చోట్లా కనుమరుగైన కాంగ్రెస్
అరెరెరెరె.. ఏం చెప్పారు.. ఎన్ని గప్పాలు! విద్యావంతులు వ్యతిరేకం.. ఉద్యోగస్తులు ప్రతికూలం.. అర్బన్లో ఆగ్రహం.. రూరల్లో ఘోరం.. అవి మాటలా.. మాయలా? నీతి రీతి లేని సోషల్ మీడియాను పట్టుకుని, ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి శోషొచ్చేదాకా గాయిగాయి చేశారు. ఆఖరికి ఏమైంది? రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ లగాయించి గెల్చింది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి, నల్లగొండ-ఖమ్మం- వరంగల్ స్థానంలో డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఢంకా బజాయించి గులాబీ జెండా ఎగరేశారు.
‘రెంటికి రెండూ మావే.. గెలిచి చూపిస్తాం’ అన్న కేసీఆర్.. ఎప్పటిలాగే.. మాట పొల్లుపోకుండా ఇద్దర్నీ గెలిపించి చూపించారు. ఒకటీ అరా గెలిచి తమాషా చేస్తున్నవారికి.. తను పట్టుబట్టి రంగంలోకి దిగితే ఫలితం ఎట్లుంటదో, పటంల పెట్టి మరీ చూపించారు.
రెండు ఎమ్మెల్సీ సీట్లంటే రెండు సీట్లే కావు! ఆరు ఉమ్మడి జిల్లాలు, 20 చిన్న జిల్లాలు, 77 అసెంబ్లీ స్థానాలు, రాజధాని, శివారు, పలు పట్టణాలు, పట్టినన్ని పల్లెలు.. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల, సబ్బండ వర్ణాల ప్రజలు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. గతంలో ఏనాడూ లేనంతగా.. లక్షల మంది పట్టభద్రులు.. బొట్టు పెట్టి పిలిచినట్టు, ప్రభోజనానికి వచ్చినట్టు కట్టగట్టుకొని కదిలి వచ్చి, రాత్రి దాకా వరుసగా బారులు తీరారు. కాకతీయ ఖిల్లా మొదలుకొని గోల్కొండ కోట వరకు.. పాలమూరు, నీలగిరి మొదలు కిన్నెరసాని తీరాల నుంచి, అనంతగిరి కొండల్లో ముచుకుంద ఊటల వరకు ‘వాడ కదిలిందిరో జంబాయిరే, తెలంగాణ కదిలిందిరో జంబాయిరే’ అంటూ లక్షల మంది విద్యావంతులు అపూర్వమైన రీతిలో తరలివచ్చారు. .
కులం లేదు, మతం లేదు, ప్రాంతీయ విభేదాలు అసలే లేవు.. సమయం వచ్చినపుడు మనందరిదీ ఒకే కుతికె అని చాటి చెప్పారు. కేసీఆర్ను- ఆయన పరిపాలనను ఆశీర్వదించారు.
‘అగో పనైపోయింది.. ఇగో మేమొస్తున్నం’.. అంటూ అబద్ధాల బండి గట్టుకుని బయల్దేరిన కోతల రాయుళ్లను కేసీఆర్ సారథ్యంలో జనం ఓట్లతో భగాయిస్తే ఏర్లల్ల, పల్లేర్లల్ల వడి పలాయనం చిత్తగించారు. పేరుగొప్ప జాతీయ పార్టీ బీజేపీ, ఉన్నది కూడా పోగొట్టుకుని, హైదరాబాద్లో సిట్టింగు సీటు నుంచి ఎలిమినేట్ అయింది. నల్లగొండలో నాలుగో స్థానంలో ఆగమైంది. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ హైదరాబాద్లో నాలుగుతో, నల్లగొండలో ఐదుతో అభాసుపాలయ్యింది. ‘తెలంగాణ కేసీఆర్ ఒక్కడే తెచ్చిండా?’ అని కోదండాలేసిన మరొక నేతకు సమితీ లేదనీ, తమ సమ్మతీ లేదనీ జనం తేల్చి చెప్పిండ్రు.
పీవీ బిడ్డకు కేసీఆర్ ఓడిపోయే టికెట్టిచ్చిండన్న వాళ్ల నోటికి జనం.. గెలుపుతో తాళం వేశారు. శతజయంతి సమయాన మన మాజీ ప్రధాని కుటుంబాన్ని మర్యాదగా, మహా గొప్పగా సత్కరించారు!
ఇది ప్రభుత్వ పనితనంపై ప్రజామోదపు మోత!
ఇది వేలి సిరా సాక్షిగా రాసిన మన ఆత్మగౌరవ చరిత!
ఇది ఇక్కడ కుల మత రాజకీయాలు చేసే వాళ్లపై రోత!
ఇది మన ప్రాంతంపై పెత్తనం చేసే శక్తులకు పెట్టిన వాత!!
ఈ విజయం..
తెలంగాణ ఐక్యతకు తార్కాణం!
ఇది స్వాభిమాన పతాకం!
మేం మీ వెంటే ఉన్నామంటూ
కేసీఆర్కు జనాశీర్వాదం!!
రాష్ట్రంలో గత ఆదివారం రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో ఎస్ వాణీదేవి, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ స్థానంలో పల్లా రాజేశ్వర్రెడ్డి విజేతలుగా నిలిచారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానాన్ని బీజేపీ నుంచి వశం చేసుకున్న టీఆర్ఎస్ నల్లగొండ-ఖమ్మం-వరంగల్లో వరుసగా రెండోసారి గెలుపొందింది. దాదాపు నాలుగురోజుపాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపులో ఆదినుంచీ గులాబీ పార్టీ అభ్యర్థులు తమ ఆధిక్యతను ప్రదర్శించారు. ఎలిమినేషన్ ప్రక్రియ మేరకు రెండో ప్రాధాన్యత ఓట్ల ఆధారంగా టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. పోలింగ్కు కేవలం 21 రోజులముందు టీఆర్ఎస్ అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకి వచ్చిన వాణీదేవి అతికొద్ది సమయంలోనే సిట్టింగ్ అభ్యర్థి, బీజేపీకి చెందిన రాంచందర్రావును మట్టి కరిపించారు.