ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా మెరుగైన వైద్యం
అడ్మిట్ అయిన దగ్గరి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చికిత్స
వ్యాధి నిర్ధారణ పరీక్షల దగ్గరి నుంచి వెంటిలేటర్ దాకా అన్నీ ఫ్రీ
ఇంకా ఫ్లూయిడ్స్, మంచి బలవర్ధకమైన ఆహారం
క్రిటికల్ కేర్ నుంచి బయటపడుతున్న రోగులు
ధీమాగా నిరుపేద కుటుంబాలు
కరీంనగర్, మే 24 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్:ఈ రెండు ఘటనలు కరీంనగర్లో జరిగినవే.. ఒకటి ప్రభుత్వ దవాఖాన అయితే, మరొకటి ప్రైవేట్ హాస్పిటల్.. సర్కారు దవాఖానలో రూపాయి ఖర్చు లేకుండా భార్యాభర్తలిద్దరూ కరోనా నుంచి కోలుకుంటే.. ప్రైవేటు దవాఖానలో తండ్రీకొడుకుల వైద్యానికి లక్షల్లో ఖర్చు చేయాల్సి వచ్చింది. ఉమ్మడి జిల్లాతోపాటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తున్న కరోనా రోగులకు కరీంనగర్ సర్కారు దవాఖాన మెరుగైన చికిత్సతో భరోసా ఇస్తున్నది. రోగి అడ్మిట్ అయిన దగ్గరి నుంచి డిశ్చార్జి అయ్యే వరకు ప్రభుత్వం ఒక్కో కరోనా బాధితుడిపై లక్షకు పైగా ఖర్చు చేస్తూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తున్నది. వ్యాధి నిర్ధారణ పరీక్షల దగ్గరి నుంచి.. ఆక్సిజన్, వెంటిలేటర్ వరకు అన్నీ ఫ్రీగా అందిస్తూ, బాధిత కుటుంబాలపై భారం పడకుండా చూస్తున్నది.
కరోనా బాధితులకు కొండంత అండగా నిలుస్తున్నాయి ప్రభుత్వ దవాఖానలు. పెరుగుతున్న రోగులకు అనుగుణంగా అదనపు సౌకర్యాలు కల్పించుకుని ఇబ్బందులు రాకుండా చూస్తున్నాయి. ప్రైవేట్ దవాఖానాల్లో లక్షల్లో ఖర్చుచేస్తే గానీ లభించిన వైద్యం ప్రభుత్వ దవాఖానల్లో పూర్తి ఉచితంగా అందుతున్నది. కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో అందుతున్న మెరుగైన వైద్య సేవలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నవి. ఉమ్మడి జిల్లాతోపాటు ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తున్న కరోనా రోగులకు ఈ దవాఖాన భరోసా ఇస్తున్నది. రోగి పూర్తిగా కోలుకునే వరకు దవాఖానలోనే ఉంచుకుని ఎలాంటి చికిత్సనైనా అందించేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పించింది. గతానికి ఇప్పటికి దవాఖానలో అనేక మార్పులు వచ్చాయి. ఏ చిన్న సమస్యతో వచ్చిన రోగులనైనా గతంలో వరంగల్ ఎంజీఎంకో, హైదరాబాద్ గాంధీ దవాఖానకో రెఫర్ చేసేవారు. కానీ, ఇప్పుడు కరోనా బారిన పడి సీరియస్గా ఉన్న వారికి చికిత్స అందిస్తూ, ప్రాణాలు పోస్తున్నారు. ఒక్కో రోగికి వారం, పది జుల్లో స్వస్థత చేకూర్చి డిశ్చార్జి చేస్తున్నారు. గతానికంటే ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్స్ను పెంచుకుని రోగులకు అవసరమైన ప్రతి వైద్య పరీక్ష, చికిత్స ఇక్కడే చేస్తున్నారు. దీంతో కరోనా బారిన పడుతున్న ఎందరో నిరుపేదలు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం పొంది ఇండ్లకు తిరిగి వెళ్తున్నారు.
ప్రైవేటులో.. తండ్రీ కొడుకులకు 15 లక్షలు
..ఇతని పేరు ఎడమల తిర్మల్రెడ్డి. సిరిసిల్లకు చెందిన ఈయన కుటుంబంలో దాదాపు అందరికీ పాజిటివ్ వచ్చింది. ముందుగా ఇతని కొడుకు ప్రపుల్ రెడ్డి సీరియస్ అయ్యాడు. ఇతన్ని కరీంనగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించి ఐదు రోజులు చికిత్స అందించడంతో కోలుకున్నాడు. ఇతనికి 4 లక్షలు బిల్లు చెల్లించి ఇంటికి వెళ్లాడో లేదో తిర్మల్రెడ్డి సీరియస్ అయ్యాడు. ఇతనికి పల్స్ 88 నుంచి 90కి పడిపోయింది. దాంతో ఇతన్ని కూడా అదే ప్రైవేట్ దవాఖానలో చేర్పించారు. 13 రోజుల తర్వాత డిశ్చార్జి చేశారు. బిల్లు చూసిన తిర్మల్రెడ్డి బంధువులకు గుండెలు గుభేలుమన్నాయి. 11 లక్షలకు లెక్క వేసి ఇచ్చారు. బిల్లు మొత్తం చెల్లించి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందిన తండ్రీ కొడుకులకు 20 రోజుల్లో 15 లక్షలు ఖర్చయ్యిందంటే ఆ కుటుంబంపై ఎంత భారం పడిందో అర్థం చేసుకోవచ్చు.
ప్రైవేట్ దవాఖానలకు దీటుగా..
కరీంనగర్ ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వసతులు ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో కరోనాతో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని ముందే గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడొక 21 మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. దీనికి తోడుగా నిమిషానికి 400 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్కు కొరత లేకుండా పోయింది. ఇప్పుడు సుమారు 298 బెడ్స్కు ప్రతిరోజూ ఆక్సిజన్ అందిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఏ కార్పొరేట్ దవాఖానలో కూడా రోగులకు ఆక్సిజన్ అందించే సదుపాయం లేదు. గతంలో 10 మాత్రమే ఉన్న వెంటిలేటర్ బెడ్స్ను ఇప్పుడు 30కి పెంచారు. అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న రోగులకు ప్రతిరోజూ వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఇక రోగులను పరీక్షించేందుకు అవసరమైన ఆటోమెట్రెడ్ ఆర్టీపీసీఆర్ ల్యాబ్ను కూడా ఇక్కడే ఏర్పాటు చేసి రోజుకు 400 షాంపిల్స్కు పరీక్షలు చేస్తున్నారు. 24 గంటల్లోనే పరీక్షల ఫలితాలు వెల్లడిస్తున్నారు. ఇలాంటి సదుపాయాలు జిల్లాలోని ఏ కార్పొరేట్ దవాఖానలో కూడా అందుబాటులో లేవని ఇక్కడ చికిత్స పొందుతున్న రోగులు అభిప్రాయపడుతున్నారు.
ప్రతి పేషెంట్పై కేర్ తీసుకుంటున్నాం..
మా దవాఖానకు వచ్చిన ప్రతి పేషెంట్పై కేర్ తీసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చే వాళ్లలో చాలా మంది సీరియస్ రోగులే వస్తున్నారు. 95 శాతం మందికి ఆక్సిజన్ అందిస్తున్నాం. రోగి సీరియస్గా ఉంటే నిమిషానికి 4 నుంచి 10 లీటర్ల ఆక్సిజన్ అందిస్తున్నాం. ఒక్క పేషెంట్కు ఐదు రోజులు ఇలా ఆక్సిజన్ అందిస్తే ప్రభుత్వం పెట్టే ఖర్చే 30 వేల వరకు అవుతుంది. అదే వెంటిలేటర్పై చికిత్స అందిస్తే ఒక్క పేషెంట్కు రోజుకు 20 నుంచి 25 లీటర్ల ఆక్సిజన్ అవసరం ఉంటుంది. దీన్ని బట్టి ఒక్క పేషెంట్పై ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తోందో అర్ధం చేసుకోవచ్చు.
చాలా బాగా చూసుకుంటున్నం
మా దగ్గరికి వచ్చే పేషెంట్లను చాలా బాగా చూసుకుంటున్నం. చాలా మంది సీరియస్గా వస్తున్నరు. ఇందులో 40 నుంచి 50 ఏండ్ల వాళ్లే ఎక్కువ ఉంటున్నరు. వీళ్లలో కొందరి బంధువులు దగ్గరికి కూడా రావడం లేదు. ఏ లోటూ రాకుండా అన్ని మేమే చూసుకుంటున్నాం. మానసికంగా ధైర్యాన్ని అందిస్తున్నాం. కొందరు సీరియస్గా వచ్చే వారికి ఎంత ప్రయత్నించినా బ్యాడ్ రిజల్ట్ వస్తోంది. అలాంటప్పుడు బాధేస్తోంది. మా వైద్యులు కూడా షిఫ్ట్ సిష్టంలో 24 గంటలు కొవిడ్ వార్డుల్లో అందుబాటులో ఉంటున్నరు. అందరం అప్రమత్తంగా ఉండి చికిత్స అందిస్తున్నాం. చాలా మంది కోలుకుంటున్నరు. సంతోషంగా ఇండ్లకు వెళ్తున్నరు. ఆలాంటి సమయంలో కొందరు కన్నీళ్లు పెట్టుకుంటున్నరు. కరోనా రోగులను రోగుల్లా కాకుండా మా ఇంటి సభ్యుల్లా చూసుకుంటున్నం. – సురేఖ, స్టాఫ్ నర్స్, ఐసొలేషన్ వార్డు (కరీంనగర్)