ప్రత్యేకప్రతినిధి, జూన్2, (నమస్తే తెలంగాణ): కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత సులభంగా నిర్వహించేందుకు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) రూపొందించిన డ్రైస్వాబ్ టెస్ట్ కిట్లు త్వర లో మార్కెట్లోకి రానున్నాయి. వీటిని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచేందుకు బుధవారం సీసీఎంబీ.. ప్రముఖ సంస్థ ‘మెరిల్ డయాగ్నస్టిక్స్’తో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. అంతేకాకుండా ఈ కిట్లను మార్కెట్లో విక్రయించేందుకు హైమీడియా, స్మార్ట్, క్యాపిటల్ హెల్త్ తదితర 5కంపెనీలకు లైసెన్సులు జారీ చేసిం ది. డ్రైస్వాబ్ విధానంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలను సులభంగా, త్వరగా చేయవచ్చని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి తెలిపారు. ఈ కిట్ల వినియోగానికి ఐసీఎంఆర్ అనుమతి కోరినట్టు తెలిపారు.
ప్రస్తుతం కొవిడ్ టెస్టులను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. కానీ సీసీఎంబీ రూపొందించిన కొత్తవిధానంలో శాంపిల్ తీసుకున్న వెంటనే నేరు గా ఆర్టీ-పీసీఆర్ యంత్రాల ద్వారా పరీక్షించి తక్కువ సమయంలోనే వ్యాధిని నిర్ధారించవచ్చు. ప్రస్తుత విధానంలో వ్యక్తుల గొంతు, ముక్కు నుంచిస్వాబ్ను సేకరించి లిక్విడ్ ఉన్న ట్యూబ్లో వేస్తారు. అనంతరం ‘వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడి యా’ (వీటీఎమ్) ద్వారా ‘ఆర్నే’ అనే ద్రవం తడి ఆరిన (డ్రై) తర్వాత ఆర్టీ పిసీఆర్పై టెస్ట్ చేస్తారు. ఈ విధానంలో మైనస్ డిగ్రీల్లో చల్లగా ఉండే ద్రావకం (లిక్విడ్) నుంచి వైరస్ను వేరుచేసి వ్యాధిని నిర్ధారించేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కానీ కొత్త విధానంలో శాంపిల్ తీసుకున్న తర్వాత లిక్విడ్ను వేరుచేయాల్సిన అవసరం లేకుండా నేరుగా ఆర్టీ-పీసీఆర్ ద్వారా పరీక్షించవచ్చని సీసీఎంబీ మాజీ డైరెక్టర్, ప్రస్తుత సలహాదారు రాకేశ్మిశ్రా ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. దీని ద్వారా సమయం కలిసిరావడంతో పాటు ఖర్చు కూడా బాగా తగ్గుతుందన్నారు. అంతేకాకుండా కొత్త విధానంలో రెట్టింపు పరీక్షలు చేయవచ్చని ఆయన తెలిపారు.