హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురం పొలాల్లో కొత్త తెలంగాణ చరిత్ర బృందం మూడువేల ఏండ్ల నాటి రెండు మెన్హిర్లను గుర్తించింది. ఫ్రెంచి భాషలో నిలువురాయిని మెన్హిర్ అంటారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీర్, కొరివి గోపాల్ తెలిపారు. ఇనుపయుగం, మెగాలిథిక్ ఏజ్లో పురామానవులు మరణించిన వారికోసం ప్రత్యేకమైన సమాధులను నిర్మించేవారని, వాటిని గుర్తించడానికి నిలువురాళ్లను అక్కడ పాతేవారని చెప్పారు. వెంకటాపురంలో గుర్తించిన రాళ్లలో ఒకటి చెక్కుచెదరకుండా ఉండగా, రెండోది కొంత విరిగిపోయి, నేలమీద పడిపోయింది. ఈ మెన్హిర్లు 4 నుంచి 5 అడుగుల వెడల్పు, 15 నుంచి 16 అడుగుల ఎత్తు ఉన్నాయి. పురాతన సాంస్కృతికి చిహ్నాలుగా ఉన్న ఈ మెన్హిర్లను భావితరాల కోసం కాపాడుకోవాలని కొత్త తెలంగాణ చరిత్రబృందం ఒక ప్రకటనలో పేర్కొంది.