సంగారెడ్డి, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : కరువు నేలగా పేరుబడిన సంగారెడ్డి జిల్లాను సీఎం కేసీఆర్ గోదావరి జలాలతో కల్పతరువుగా మారుస్తున్నారని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లిలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, ఎంపీలు ప్రభాకర్రెడ్డి, బీబీపాటిల్, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, మాణిక్రావు, మహిపాల్రెడ్డి, జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. సర్వే పనులు ప్రారంభం అనంతరం లింగంపల్లి ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడారు. సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్ సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులను శంకుస్థాపన చేస్తారన్నారు. 70 రోజుల్లో డీపీఆర్ ప్రభుత్వానికి అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
వేగంగా ఈ ఎత్తిపోతలను పూర్తి చేసి గోదావరి జలాలతో ఝరాసంగంలోని సంగమేశ్వరుని పాదాలకు జలాభిషేకం చేస్తామని తెలిపారు. సంగమేశ్వర ఎత్తిపోతలతో జిల్లాలో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు తెలిపారు. ఒకప్పుడు పశ్చిమ మెదక్ జిల్లా కరువు ప్రాంతంగా ఉండేదన్నారు. సాగునీటి వసతులు లేక ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారని మంత్రి చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే జిల్లా కరువు ప్రాంతంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ప్రాణహిత-చేవెళ్ల పథకంలో సంగారెడ్డి జిల్లాలోని ఏ ఒక్క నియోజకవర్గానికి సాగునీరు వచ్చేలా డిజైన్ చేయలేదన్నారు. సంగారెడ్డి జిల్లా రైతుల ఇబ్బందులు, సాగునీటి వనరులపై సీఎం కేసీఆర్కు సంపూర్ణమైన అవగాహన ఉందన్నారు. నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాలకు బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందజేయనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వాలు జిల్లా ప్రజలకు కాలుష్యాన్ని అందజేస్తే, సీఎం కేసీఆర్ గోదావరి జలాలు అందజేస్తున్నారని చెప్పారు.
సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని ప్రధాన చెరువులు, వాగులను గోదావరి జలాలతో నింపుతామని మంత్రి తెలిపారు. గోదావరి జలాల రాకతో జిల్లాలో సాగునీటి కష్టాలు తీరుతాయని, పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన సంగారెడ్డి ఇకపై సాగునీటి రంగంలో కొత్త చరిత్రకు నాంది పలకనున్నట్లు మంత్రి తెలిపారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ.. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా సంగారెడ్డి జిల్లాలో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుండడం సంతోషం కలిగిస్తుందన్నారు. అధికారులు త్వరగా సర్వే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో జిల్లా సాగునీటి వనరులు అభివృద్ధి కోసం రూ.1000 కోట్ల నిధులు అడిగితే రూ.100 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వాలు సాగునీటి రంగాన్ని విస్మరించినట్లు తెలిపారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా జహీరాబాద్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందనుండడం సంతోషాన్ని కలిగిస్తున్నట్లు చెప్పారు. జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కృషితోనే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు మంజూరైనట్లు తెలిపారు.వీటిద్వారా బీడు భూములకు సాగునీరు అందనున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతం సస్యశ్యామలం కానుందన్నారు. రైతులు బంగారు పంటలు పండిస్తారన్నారు.
జగ్గారెడ్డికి మంత్రి పలకరింపు…
సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులు ప్రారంభోత్సవానికి సంగారెడ్డి హాజరైన మంత్రి హరీశ్రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకరికొకరు తారపడటంతో పరస్పరం పలకరించుకున్నారు. ఇది అక్కడ ఉన్న అందరినీ ఆకర్షించింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, టీఎస్పీఎస్సీ సభ్యుడు ఆర్.సత్యనారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్చైర్మన్ మాణిక్యం, టీఆర్ఎస్ జిల్లా నాయకులు జైపాల్రెడ్డి, ఇరిగేషన్ సీఈ అజయ్కుమార్, మునిపల్లి ఎంపీపీ శైలజా శివశంకర్, కొండాపూర్ ఎంపీపీ మనోజ్రెడ్డి, వైస్ ఎంపీపీ కమ్రోద్ద్దీన్, జడ్పీటీసీలు మీనాక్షి సాయికుమార్, మల్లిఖార్జున్ పాటిల్, పత్రి అపర్ణ శ్రీకాంత్, స్వప్నభాస్కర్, అరుణమోహన్రెడ్డి, సర్పంచ్ జయరంజనీ, మునిపల్లి మండల సర్పంచ్లు విశ్వనాథం పాటిల్, రమేశ్, శ్రీనివాస్, మల్లేశం, వీరన్న పాటిల్, శంకర్, ప్రభు, వనిత, ఎంపీటీసీలు శివకుమార్, స్వప్న, కోఆప్షన్ సభ్యులు సలావొద్ద్దీన్, టీఆర్ఎస్ మండల మైనార్టీ శాఖ అధ్యక్షుడు కుత్బోద్దీన్, వట్పల్లి మార్కెట్ చైర్మన్ రజనీకాంత్, చౌటకూర్ టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శివకుమార్, నాయకులు చంద్ర య్య, నారాయణ, కార్తీక్, ఆనంద్, మోగులయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎత్తిపోతల పథకంతో జిల్లా సస్యశ్యామలం
శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి మాట్లాడుతూ.. సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో జిల్లా సస్యశ్యామలం కానున్నట్లు చెప్పారు. జిల్లాకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసిందుకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా సాగునీటి రంగాన్ని విస్మరించినట్లు చెప్పారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ.. జహీరాబాద్ ప్రాంతంలో ఒక్క ప్రాజెక్టు లేదన్నారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. సంగమేశ్వర ఎత్తిపోతలతో జహీరాబాద్ నియోజకవర్గంలో బంగారు పంటలు పండుతాయన్నారు. ఎత్తిపోతల పథకం మంజూరు చేసిన సీఎం కేసీఆర్, సహకరించిన మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లా అగ్రస్థానం
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నట్లు తెలిపారు. సాగునీటి రంగంలో ఉమ్మడి మెదక్ జిల్లా అగ్రస్థానంలో ఉండేలా సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో రైతుల దశ మారనున్నట్లు చెప్పారు.
సర్వే చారిత్రాత్మక ఘట్టం..
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. సంగమేశ్వర ఎత్తిపోల సర్వే పనులు ప్రారంభించడం చారిత్రాత్మక ఘట్టం అన్నారు. రైతులకు పండుగ రోజుగా అభివర్ణించారు. సంగారెడ్డి జిల్లా రైతాంగం సాగునీటి కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంత రైతులు వర్షాల కోసం మేఘాలవైపు చూసే రోజులు దూరమవుతాయని తెలిపారు. సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా సంగారెడ్డి నియోజకవర్గంలో 56వేల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు.
గత ప్రభుత్వాలు విస్మరించాయి..
సంగమేశ్వర సర్వే పనులు ప్రారంభం కావటం ఆనందంగా ఉందని అందోలు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. గత ప్రభుత్వాలు సాగునీటి రంగాన్ని పూర్తిగా విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు చొరవ ఫలితంగా సింగూరు ప్రాజెక్టు ద్వారా 40వేల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నట్లు చెప్పారు. తాజాగా సంగమేశ్వర ఎత్తిపోతలతో మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో 57వేల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు.