హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణలో భాగంగా సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మెగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు ఆ ఫోర్స్ సదరన్ సెక్టార్ ఐజీ మహేశ్చంద్ర లడ్డా చెప్పారు. ఆదివారం ఉదయం సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్ హెడ్క్వార్టర్స్లో ఆయన మొక్కలు నాటి కార్యక్రమం ప్రారంభించారు. గ్రీన్ ఇండియా-క్లీన్ ఇండియా నినాదంతో సౌత్సెక్టార్లో పరిధిలోని సీఆర్పీఎఫ్ కేంద్ర కార్యాలయం, గ్రూప్ సెంటర్లు, ఇతర అన్ని యూనిట్లలో కలిపి ఆదివారం ఒక్కరోజే 22,500 మొక్కలు నాటినట్టు ఆయన తెలిపారు. ఈ సీజన్లో సౌత్ సెక్టార్ పరిధిలో 1.60 లక్షల మొక్కలు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 1.15 లక్షల మొక్కలు నాటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఐజీలు రాజ్కుమార్, ఖాజా సజానుద్దీన్, కమాండెంట్లు విశ్వనాథ్, అమర్సింగ్ మీనా తదితరులు పాల్గొన్నారు.