హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుపై సోమవారం ప్రగతిభవన్లో సన్నాహక సమావేశం జరుగనున్నది. మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం జరుపాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. మధిర నియోజకవర్గంలోని చింతకాని, తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, అచ్చంపేట -కల్వకుర్తి నియోజకవర్గాల్లోని చారగొండ , జుకల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాల్లో దళితబంధు పథకాన్ని హుజూరాబాద్తోపాటు పైలట్ ప్రాజెక్టుగా చేపడుతామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ కోసం సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. సోమవారం జరుగనున్న ఈ సన్నాహక సమావేశంలో ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు, జిల్లాపరిషత్ చైర్మన్లు, కలెక్టర్లు, మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, జుకల్ నియోజవర్గాల శాసనసభ్యులు, ఎస్సీ కులాల అభివృద్ధి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్కుమార్, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి, సీఎం సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఫెనాన్స్ సెక్రటరీ తదితరులు పాల్గొంటారు. పథకం తీరుతెన్నులను వివరించేందుకు క్షేత్రస్థాయి అనుభవం కలిగిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటారని సీఎం తెలిపారు.