రంగారెడ్డి, సెప్టెంబర్ 11, (నమస్తే తెలంగాణ): డ్రోన్ టెక్నాలజీ ప్రపంచంలోనే చరిత్ర సృష్టిస్తుందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. గ్రాహంబెల్ సృష్టించిన టెలిఫోన్, రైట్ బ్రదర్స్ సృష్టించిన విమానంలాగా తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ ఆర్థికసంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన డ్రోన్ టెక్నాలజీ ఓ సంచలనంగా మారుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’ కార్యక్రమాన్ని శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్గ్రౌండ్ వేదికగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు, విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. బ్లూ డార్ట్, మారుట్, టెక్ ఈగల్ స్టార్టప్లు ఈ ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ సందర్భంగా జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ స్టార్టప్లను చిన్నచూపు చూడొద్దని, డ్రోన్ టెక్నాలజీ ఒకటి వస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించలేదని అన్నారు. అలాంటిది డ్రోన్ల సహాయంతో వ్యాక్సిన్లు, మందులు, రక్తం చేరవేయటం ఎంతో గర్వకారణమని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశం ప్రపంచానికే లీడర్గా అవతరిస్తున్నదని అన్నారు. అదేవిధంగా దేశంలో ఏరోస్పేస్ రంగం ఎంతోవేగంగా మార్పులు చెందుతున్నదని తెలిపారు. ఇతర రాష్ర్టాలతో చర్చించి డ్రోన్ల వాడకానికి మూడు రకాల జోన్లను ఏర్పాటుచేస్తామని చెప్పారు. గ్రీన్జోన్ పరిధిలో డ్రోన్ల వినియోగానికి ఎలాంటి అనుమతి అవసరంలేదని, ఎల్లో జోన్ పరిధిలో అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని, రెడ్ జోన్లో డ్రోన్లకు ఎలాంటి అనుమతులివ్వబోమని మంత్రి స్పష్టం చేశారు.
దేశానికే మార్గదర్శకం: మంత్రి కేటీఆర్
రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నదని చెప్పారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా డ్రోన్ టెక్నాలజీతో వ్యాక్సిన్లు, మందులను సరఫరాచేసే ‘మెడిసిన్ ఫ్రం ది స్కై’ ప్రాజెక్టును రాష్ట్రంలో చేపట్టడం గర్వకారణమన్నారు. డ్రోన్ల వాడకంతో లెక్కలేనన్ని ఉపయోగాలున్నాయని, ఈ దిశగా మరిన్ని ప్రయోగాలు చేస్తున్నామని చెప్పారు. సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడని సాంకేతికత నిష్ఫలమని సీఎం కేసీఆర్ అంటుంటారని గుర్తుచేశారు. రెండేండ్ల క్రితమే దావోస్లో డ్రోన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని కేటీఆర్ తెలిపారు. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు సందర్భంగా.. హాజరైన ప్రతినిధులు డ్రోన్ టెక్నాలజీతో ప్రయోగాలు చేస్తే దేశానికే ఆదర్శంగా నిలుస్తారని, సాంకేతిక రంగంలో పురోగమిస్తున్న తెలంగాణలో ఆ ప్రయత్నం ఎందు కు చేయకూడదని అడిగారని, అందుకు అక్కడే ఒప్పుకున్నామని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కొవిడ్ దృష్ట్యా కొంత జాప్యం జరిగినప్పటికీ మూడు స్టార్టప్స్తో ఈ ప్రాజెక్టును విజయవంతంగా చేపట్టడం సంతోషంగా ఉన్నదన్నారు. డ్రోన్ల సహాయంతో ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా అత్యవసరమయ్యే మందులు, వ్యాక్సిన్లను గమ్యస్థానానికి చేరవేయవచ్చని తెలిపారు. అవసరమైతే కొండలు, గుట్టలు, రోడ్లులేని ప్రదేశాలకు కూడా అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్లు, రక్తం తదితరాలను డ్రోన్ల సహాయంతో అందించవచ్చని చెప్పారు. ఏడాదిక్రితం డ్రోన్ టెక్నాలజీ వాడకానికి సంబంధించి స్టార్టప్లను ఆహ్వానించగా ఇద్దరు యువతులు మహిళల భద్రతకు సంబంధించి గొప్ప ప్రాజెక్టును తయారుచేశారని తెలిపారు. ‘రంగారెడ్డి జిల్లాలో దిశ ఘటన జరిగింది. అలాంటి పరిస్థితి ఏ అమ్మాయికైనా ఎదురైతే వెంటనే తమ ఫోన్లో ఒక్క బటన్ నొక్కితే చాలు. ఆ ప్రాంతానికి నిమిషాల వ్యవధిలో డ్రోన్ సైరన్ చేస్తూ చేరిపోవడమే కాకుండా అక్కడి దృశ్యాలను చిత్రీకరిస్తుంది. డ్రోన్ సైరన్ చప్పుడుకే నిందితులు పారిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు బాధితులు ప్రమాదం నుంచి బయటపడొచ్చు’ అని వివరించారు.