హైదరాబాద్, ఆగస్ట్ 5 (నమస్తే తెలంగాణ): మూరుమూల ప్రాంతాలకు సైతం సూపర్ స్పెషాల్టీ సేవలు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించిన 7 మెడికల్ కాలేజీల నిర్మాణాల దిశగా చురుకుగా అడుగులు పడుతున్నాయి. ఆధునిక హంగులు, సకల సదుపాయాలతో ఒక్కో మెడికల్ కాలేజీని రూ.510 కోట్ల వ్యయంతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది. నూతన కాలేజీల నిర్మాణాలు జరుగనున్న సంగారెడ్డి, నాగర్కర్నూల్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాల్లో అధికారులు పలు దఫాలుగా పర్యటించి నిర్మాణ స్థలాలు ఖరారు చేశారు. మంచిర్యాల జిల్లాలో ఎంపిక చేసిన స్థలం గోదావరి నది ఒడ్డున ఉండటం కారణంగా అధికారులు పునరాలోచనలో పడ్డారు. భవిష్యత్లో సమస్యలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వేరే స్థలాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. మిగతా జిల్లాల స్థలాలపై అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ స్థలాల ఖరారుపై ఒకట్రెండు రోజుల్లో అత్యున్నతస్థాయి సమావేశం జరుగనున్నట్టు తెలుస్తున్నది.
కసరత్తు పూర్తి
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా 4 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. వాటిలో ఏడాదిన్నరలోపే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. నిబంధనల ప్రకారం, మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 300 పడకల దవాఖాన తప్పనిసరి. జగిత్యాల, వనపర్తి, నాగర్కర్నూల్లో వంద పడకల దవాఖానలు, మహబూబాబాద్లో 150 పడకలు, కొత్తగూడెం, మంచిర్యాలలో 200 పడకల దవాఖానలు ఉన్నాయి. వీటిని 300 పడకల దవాఖానలుగా అప్గ్రేడ్ చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన కసరత్తును తెలంగాణ వైద్యవిధాన పరిషత్ పూర్తి చేసింది.