ఐపీఎల్ మ్యాచ్ల కోసం ఎంపిక చేసిన ఆరు నగరాలలో హైదరాబాద్ లేకపోవడం దిగ్భ్రాంతికరం. కొవిడ్ నియంత్రణలో మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ముందున్నది. ఉప్పల్ స్టేడియం అత్యుత్తమమైనదిగా నాలుగు సార్లు గుర్తింపు పొందింది. అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా అన్ని హంగులు ఉన్న నగరమిది. ఇక్కడ ప్రేక్షకాదరణకు కొదువ లేదు. చరిత్ర పుటలు తిరిగేస్తే- అంతర్జాతీయ యవనికపై దేశానికే వన్నె తెచ్చిన క్రీడాకారులు ఇక్కడ ఉన్నారు. వర్తమానంలో కూడా- పలువురు క్రీడాకారులు, క్రీడాకారిణులు ఇక్కడ ఎదిగివచ్చిన కారణంగా, ‘హైదరాబాద్ పానీ’లోనే క్రీడా కౌశలం ఉందనే ప్రశంసలు వచ్చాయి. అయినా ఫ్రాంచైజీలేని అహ్మదాబాద్ (గుజరాత్) నగరానికి ఎనిమిది మ్యాచ్లకు అవకాశం ఇచ్చి హైదరాబాద్కు మొండిచేయి చూపడం ఆశ్చర్యకరం. ఇది ఇక్కడి యువతను, క్రికెట్ అభిమానులను చిన్నచూపు చూడటమే!
ఒక రాష్ర్టానికి అన్యాయం జరిగితే వెంటనే తప్పు దిద్దుకోవడమో, అనునయ వాక్యాలు పలకడమో కేంద్రంలో ఉన్న పెద్దల బాధ్యత. కానీ కేంద్ర పరిపాలకులు కావచ్చు, కేంద్రీయ సంస్థలలోని పెద్దలు కావచ్చు, తామేదో రారాజులైనట్టు వ్యవహరిస్తుంటారు. రాష్ట్రంలోని కొందరు వ్యక్తులు కూడా ఢిల్లీలోని పెద్దలను మెప్పించలేకపోవడం మన తప్పనే వాదన వినిపిస్తుంటారు. హైదరాబాద్ నగరమొకటి ఉన్నదనేది ఐపీఎల్, బీసీసీఐ నిర్వాహకులకు తెలువదా? అన్ని కోణాలలో పరిశీలించి నిర్ణయం తీసుకోవడం వారి బాధ్యత కాదా? వివరాలు కావలిస్తే అడిగి తెప్పించుకోవాలి. రాష్ర్టాలు ఎప్పుడూ తమ దగ్గర దేబిరిస్తూ ఉండాలనే కుసంస్కృతిని ఇప్పటికైనా వదులుకోవాలి. హైదరాబాద్ అన్నివిధాలా అర్హమైనదనీ, ఇక్కడ మ్యాచ్లు నిర్వహిస్తే అన్నివిధాలా సహకరిస్తామని రాష్ట్ర మంత్రి కేటీఆర్ బహిరంగంగా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలోనైనా ఐపీఎల్ దిగిరావాలి.
ఐపీఎల్ నిర్వాహకుల తప్పుడు నిర్ణయం యాథాలాపంగా జరిగింది కాదు. రాష్ర్టాలను లెక్కచేయని కేంద్రీకృత పోకడ ఢిల్లీ పెద్దలలో తారట్లాడుతున్నది. రాజకీయ నాయకత్వంలోని ఈ జాడ్యం అన్నిరంగాలకూ సోకింది. ఇటీవలి కాలంలో మన రాజకీయ వ్యవస్థలో కేంద్రీకృత ధోరణులు మరింత పెరిగిపోతున్నాయి. సమాఖ్య స్ఫూర్తి అడుగంటుతున్నది. విశాలమైన, వైవిధ్యభరితమైన మన దేశంలో రాజకీయ వ్యవస్థ వికేంద్రీకరణను పెంపొందించేదిగా, బహుళత్వాన్ని గుర్తించేదిగా ఉండాలి. కానీ రాష్ర్టాల ఆదాయాలకు గండికొట్టి బలహీనపరచడం, సెస్ల పేర పన్నుల వాటాను ఎగవేయడం, ప్రాం తీయ పార్టీలను అణచివేయబోవడం వంటి నిరంకుశ పోకడలు పెరిగిపోతున్నాయి. ఆవు చేనులో మేస్తే, దూడ గట్టున మేస్తుందా అన్న ట్టు క్రీడలతో సహా అన్నిరంగాలూ రాజకీయ పెద్దల అడుగు జాడల్లో నడుస్తున్నాయి. దీనివల్ల దేశ పరిపాలనలో తాము భాగస్వాములమనే భావనను వివిధ ప్రాంతాల ప్రజలు కోల్పోయే ప్రమాదమున్నది. ఈ పరిస్థితిని చక్కదిద్దవలసిన బాధ్యత కేంద్ర పాలకులదే!