గాజా : ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గత సోమవారం రాజధాని నగరం జెరూసలేంలోని ఆల్ అక్సా మసీదు ప్రాంగణంలో ఇజ్రాయెల్ బలగాలు, పాలస్తీనియన్ల మధ్య జరిగిన ఘర్షణ ప్రస్తుత పరిస్థితులకు దారి తీసింది. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై రాకెట్ దాడులు చేస్తుండగా.. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. శనివారం గాజాలోని 12 అంతస్థుల భవనంపై ఇజ్రాయెల్ బలగాలు క్షిపణి దాడి చేయడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. భారీ క్షిపణి దాడిలో కుప్పకూలిన 12 అతస్థుల ఆల్-జలాల్ భవనం కూలిపోయింది. ఇందులో విదేశీ మీడియా సంస్థల కార్యాలయాలున్నాయి. అమెరికాకు చెందిన వార్తా సంస్థ అసోసియేట్ ప్రెస్ కార్యాలయం సైతం ఉంది. అలాగే అల్ జజీరా, ఇతర మీడియా సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. దాడికి ముందే హెచ్చరికలు చేయడంతో భవనాన్ని సిబ్బంది ఖాళీ చేశారు.
ఆ తర్వాత గంటకే ఇజ్రాయెల్ సేనలు భవనంపై దాడి చేశాయి. ముందే భవనం ఖాళీ చేయడంతో పెద్ద ఎత్తున ప్రాణాపాయం తప్పింది. అయితే, దాడికి గల కారణాన్ని ఇజ్రాయెల్ వెల్లడించలేదు. మరో వైపు ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న కాందిశీకుల శిబిరంలో సైతం సైన్యం దాడులకు పాల్పడింది. కాందిశీకుల శిబిరంపై బాంబుల వర్షం కురిపించడంతో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. అలాగే హమాస్ ఉగ్రవాద సంస్థ ఖలీల్ నివాసాన్ని ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో గాజాలో ఇప్పటి వరకు 41 మంది పిల్లలు సహా 145 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. 1,100 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు 2,300 మంది వరకు రాకెట్ దాడులు చేయగా.. ఇజ్రాయెల్లో హమాస్ ఉగ్రవాదుల దాడిలో ఓ సైనికుడు సహా పది మంది వరకు చనిపోగా.. 560 మంది గాయపడ్డారు.
గాజాలో ప్రాణ నష్టంపై ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మీడియా సంస్థలతో కూడిన భవనంపై ఇజ్రాయెల్ దాడి చేయడంపై తీవ్రంగా కలత చెందారని, ఈ మేరకు ఆయన ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. పౌర, మీడియా నిర్మాణాలను లక్ష్యం చేసుకోవడం అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య చెలరేగిన హింస నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడుతూ.. హమాస్, ఇతర ఉగ్రవాద గ్రూపుల రాకెట్ దాడులకు వ్యతిరేకంగా తనను తానురక్షించుకునే ఇజ్రాయెల్ హక్కుకు బైడెన్ మద్దతు తెలిపారు. గాజాలోని అమాయక ప్రజల మరణాలు, పాత్రికేయుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు జరుగుతున్న ఘర్షణలకు ఇజ్రాయెల్ తీసుకుంటున్న చర్యలపై నెతన్యాహు బైడెన్కు వివరించారు. తమకు మద్దతుగా ఉన్నందుకు అమెరికాకు ఇజ్రాయెల్ పీఎం కృతజ్ఞతలు తెలిపారు.