హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు గ్రామస్థాయిలో రోడ్డు భద్రతా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ అంజనీకుమార్ చెప్పారు. గురువారం తన కార్యాలయంలో రహదారుల భద్రతా చర్యలపై పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కమిటీలో రిటైర్డ్ టీచర్లు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను సభ్యులుగా నియమించనున్నట్టు డీజీపీ వెల్లడించారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే హాట్స్పాట్లను ఇప్పటికే గుర్తించామని, జిల్లా కలెక్టర్లు, ఆర్అండ్బీ, ట్రాఫిక్, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో రహదారులు మొత్తం 29,583 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయని వివరించారు. వీటిలో 2020లో 2,882 మంది, 2021లో 7,557 మంది, 2022లో 7,559 మంది మరణించారని తెలిపారు.
వీటిలో ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో ఎక్కువగా మరణాలు సంభవించాయని, మొత్తం యాక్సిడెంట్లలో ఇవి 53 శాతమని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను 47 శాతం తగ్గించడంతోపాటు, 63 శాతం మరణాలను తగ్గించడంలో ములుగు జిల్లా మంచి ఫలితాలు సాధించిందని డీజీపీ అభినందించారు. 2021, 2022తో పోల్చితే 2023 మొదటి మూడు నెలల్లో రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని రోడ్డు భద్రతా విభాగం అడిషనల్ డీజీ శివధర్రెడ్డి వెల్లడించారు. 45 ఏండ్లు నిండిన డ్రైవర్లందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని పేరొన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టిన జిల్లాల ఎస్పీలను డీజీపీ అభినందించారు. కాన్ఫరెన్స్లో అడిషనల్ డీజీ సంజయ్కుమార్ జైన్, ఐజీలు చంద్రశేఖర్రెడ్డి, షానవాజ్ ఖాసిం, ఎస్పీ రాఘవేందర్రెడ్డి పాల్గొన్నారు.
సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్శాఖ కొత్తగా ‘సైబర్ సెక్యూరిటీ బ్యూరో’ను ఏర్పాటుచేసింది. ఇది బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి విధులు నిర్వర్తిస్తుంది. ఈ బ్యూరోలో 500 మంది సిబ్బందిని నియమించారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (టీ4సీ తోపాటు ప్రతి జిల్లాలో ‘సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్’లను ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని 800 పోలీస్స్టేషన్లలో ప్రత్యేకంగా పోలీస్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చి సైబర్ వారియర్లుగా తయారు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు టోల్ఫ్రీ నంబర్ 1930, 100లకు వచ్చిన ఫిర్యాదులను విశ్లేషించి.. నేరాల అదుపునకు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.