హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): కరోనా అనంతరం రాష్ట్రంలో పర్యాటకరంగం తిరిగి పుంజుకుంటున్నది. ఈ ఏడాది మే, జూన్లో దాదాపు నెలరోజుల పాటు లాక్డౌన్ అమలులో ఉండగా జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలు టూరిస్టులతో కళకళలాడాయి. దీంతో కరోనా అనంతర కాలంలో పర్యాటకాభివృద్ధి సంస్థకు రూ.29.06 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది జనవరి నుంచి వచ్చిన మొత్తం ఆదాయంలో ఇది దాదాపు 25 శాతం కావడం గమనార్హం. ప్రాజెక్టులు, సరస్సులు, చెరువులు జలకళను సంతరించుకోవడం, జలపాతాలు పోస్తుండటంతో పర్యాటకుల తాకిడి పెరిగిందని టీఎస్టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా తెలిపారు. ఈ ఏడాది మొత్తంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే ఎక్కవమంది పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు వచ్చారని, దీంతో హరితహోటళ్లు, బోటింగ్పై ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పారు.
యునెస్కో రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వసంపదగా గుర్తించేలా చర్యలు తీసుకున్న సీఎం కేసీఆర్కు మంత్రి శ్రీనివాస్గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. రామప్ప దేవాలయ వద్ద పర్యాటక ప్రోత్సాహంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రపంచ పర్యాటకులు పర్యటించే అవకాశం ఉండటంతో రామప్పదేవాలయం వద్ద 16 కాటేజీలు, రెస్టారెంట్లు, ఫ్లోటింగ్ జెట్టి డెక్లను ఏర్పాటుచేశామని, రామప్పదారిలో టెంపుల్ టూరిజంను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే యాదాద్రి దేవాయలం, వేయిస్థంబాల గుడి, భద్రకాళి ఆలయాలను లింక్ చేసి అభివృద్ధి చేస్తున్నామన్నారు. నల్లగొండలో బుద్ధవనం ప్రాజెక్టుకు ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.