క్రీ.శ.1530 నాటిదైన ‘ప్రబంధ రత్నావళి’ అనే ప్రాచీన కావ్య సంకలన గ్రంథాన్ని పరిష్కరించి వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ప్రచురించారు. ఆ ప్రబంధ రత్నావళిలో పద్మకవి తెలుగులో రచించిన ‘ఆవేంద్రపురాణం’ కావ్యం నుంచి ఒకసీస పద్యం ‘మందర పర్వత వర్ణన’తో కూడింది కన్పిస్తున్నది. ఆ వర్ణన రమ్యంగా కావ్యశైలిలో వుంది. అదేగాక సర్వదేవుడు రచించిన ‘ఆదిపురాణం’ అనే కావ్యం నుంచి ఒక మత్తేభం, ఒక కందము ప్రబంధ రత్నావళిలోఉదహరింపబడినాయి. చంద్రోదయం వర్ణనతో కూడిన ఈ పద్యాలు కావ్యశైలిలో వున్నాయి.
క్రీ.శ.850-1000 మధ్యకాలంలో శైవకవులు తెలుగు కావ్యాలు రచించారనీ, నన్నయకు పూర్వం తెలుగులో సాహిత్యం సృష్టింపబడిందనీ ఆది జైన సాహిత్యం అనీ, అది మొదటిసారిగా ప్రబంధ రత్నావళి నిరూపిస్తున్నదని నిడదవోలు వెంకట్రావుగారు అభిప్రాయపడినారు. నన్నయకు పూర్వము తెలుగులో కావ్యసృష్టి జరగిందని ఈ ప్రబంధ రత్నావళిలో లభించిన పద్యాలను బట్టి తెలుస్తున్నది. ఈ కావ్యాలు జైన సంబంధమైన వస్తువుతో కూడి ఉన్నవి అని తెలుస్తున్నది. న్నయకు పూర్వము తెలుగు సాహిత్యం వున్నది. తెలుగులో కావ్యాలు రచింపడ్డాయనే మాటలు వ్యాప్తిలో వున్నాయి.
జైనుల కావ్యాలను నన్నయ ఒక అర్రలో వేసి కాల్చివేశాడని ఐతేహ్యం. దీన్నిబట్టి తెలుగులోనూ కన్నడం, తమిళంలో వలె జైనులు కావ్యాలు రచించారని వాటిని వైదిక అభిమానులు నిరాదరించి నీరుగార్చారని తెలుస్తున్నది. ఈ ఐతిహ్యాన్ని వీరేశలింగం పంతులు గారు తన ‘ఆంధ్ర కవుల చరిత్ర’లో గ్రంథస్థం కూడా చేశాడు.
తెలుగులో జైన సాహిత్యము వేములవాడ చాళుక్యుల కాలంలో వచ్చిందని పరిశోధనల వల్ల తెలుస్తున్నది. నన్నెచోడుడు తన ‘కుమార సంభవం’ పీఠికలో..
‘మును మార్గ కవితా లోకం
గున వెలయగ దేశీకవిత బుట్టించి తెనుం
గున నిలిపి రంధ్ర విషయం
బున జన చాళుక్యరాజు మొదలుగ పలువుర్..’ అని రాశాడు.
చాళుక్యరాజులు ‘దేశీ కవితను పుట్టించి తెనుంగున నిలిపి రంధ్ర విషయంబున’ ఆ నిలిపిన రాజులు తూర్పు చాళుక్య రాజులు కాక తెలంగాణానేలిన వేములవాడ చాళుక్యులు అని ఇప్పటి పరిశోధనలను బట్టి చెప్పుకోవాలె.
ఎర్రన తన నరసింహ పురాణంలో.. ‘గాసట బీసటే చదివి గాథలు తవ్వు తెలుగువారి’అని అన్నాడు. ‘గాసట బీసట’ అంటే జైనులు బౌద్ధులైన కవులు వ్రాసిన కావ్యాలని అవి చదివే తెలుగు వాళ్ళకు వ్యాసుడు రచించిన మహాభారతం పరమార్థాన్ని నన్నయ్య, తిక్కనలు తెలియజేశారని అతని అభిప్రాయమై ఉంటుంది.
జైన, బౌద్ధుల సాహిత్యం మౌఖికం కాదని ‘చదివి’ అని ఎర్రన అనటం చేత అది లిఖిత సాహిత్యమని చెప్పాలె. జైన కావ్యాలను గురించి కొంతవరకు ప్రబంధ రత్నావళి వంటి ప్రాచీన పద్య సంకలన గ్రంథాల వల్ల తెలుస్తున్నది. తెలంగాణలో జైనమే కాక బౌద్ధం కూడా విశేషంగా విస్తరించి ఉండేది. కాబట్టి బౌద్ధులు కూడా తమిళంలో వలె సాహిత్య సృజన చేసి ఉంటారు. అది దొరకటం లేదు. 1920లో తెలుగు సాహిత్య చరిత్రను ‘ఆంధ్ర వాఙ్మయ చరిత్ర’ పేరుతో రాసిన వంగూరి సుబ్బారావు గారు ‘బ్రాహ్మణ వాఙ్మయమునకు పూర్వము తెలుగులో రచించిన బౌద్ధ జైన వాఙ్మయములు ప్రస్తుతము నశించినట్లే’ అని అంటూ.. అవి ఎన్నడైనా దొరకగలవని శాంతించెదను అన్నారు. కానీ కాకతీయులలో మొదట ఇద్దరు రాజులు ‘రాష్ట్రకూట’ అని పేరు పెట్టుకున్నారు.
సాహిత్య చరిత్రలో జౌన బౌద్ధ యుగాలను పూర్తిగా చెరిపేసి తెలుగు సాహిత్యకారులు నన్నయ్యతో ఏకంగా తెలుగు సాహిత్య చరిత్రలను ఆరంభించి రాస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సాహిత్య చరిత్రను రాసుకునేటప్పుడు జైన యుగాన్నిచేరుకొని రాసుకుంటున్నాం. విస్మరింపబడిన వైదిక రచనలు భిన్నమైన జైనాద ధర్మాన్ని చెప్పే సాహిత్య రచనలను మన సాహిత్య చరిత్రకారులు లెక్కచేయకుండా సరైన పరిశోధనలు చేయకుండా సాహిత్య చరిత్రలో రాశారు. దాన్ని ఇప్పుడు మనం సవరించుకుంటున్నాం. కొత్తగా పరిశోధనలతో తెలంగాణ భూమి మీద సృష్టించబడిన సాహిత్య రచనల ప్రాచీనతలను తెలుసుకొని కొత్త అధ్యాయాన్ని రచించుకుంటున్నాం.