ఒక్కోదాని ఖరీదు రూ.6-7 వేలు
మొత్తం చికిత్సకు రూ.14 లక్షలు
అహ్మదాబాద్, మే 10: దేశంలోని పలు నగరాల్లో కరోనా రోగులు బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్తోనూ బాధపడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు గుజరాత్లోని పలు దవాఖానాల్లోనూ బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. ఈ వ్యాధికి చికిత్సలో వాడే ఇంజెక్షన్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే కరోనా రోగులకు చికిత్సలో వాడే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు దొరకటం లేదనుకుంటే… బ్లాక్ ఫంగస్ చికిత్సకు వినియోగించే యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్లు కూడా లభించక వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్లాక్ ఫంగస్కు చికిత్స చాలా ఖరీదైనది. దీనికి యాంఫోటెరిసిన్ బీ ఇంజెక్షన్లను 15 నుంచి 21 రోజుల పాటు ఇస్తుంటారు. అవసరమైనే రోగి ముక్కు నుంచి ఫంగస్ను తొలగించడానికి శస్త్రచికిత్స చేస్తుంటారు. ఆపరేషన్ చేసినప్పటికీ ఈ ఇంజెక్షన్ను కొనసాగిస్తారు. ఇవి రోగి బరువును బట్టి రోజుకి 6 నుంచి 9 ఇంజెక్షన్లు అవసరమవుతాయి. ఒక్కోదాని ధర రూ.6,000 నుంచి రూ.7,000 వరకు ఉంటున్నది. ఈ ఇంజెక్షన్లకే రూ.13 లక్షల నుంచి రూ.14 లక్షలు ఖర్చవుతుంది. సౌరాష్ట్ర ప్రాంతంలో బ్లాక్ ఫంగస్ బారినపడిన రోగులు చికిత్స కోసం రాజ్కోట్కు వస్తున్నారు. దీంతో ఇక్కడ దవాఖానాలపై ఒత్తిడి పెరిగింది.