హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నియంత్రణను సమర్థంగా నిర్వహించడానికి అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, మానవ వనరులను గరిష్ఠస్థాయిలో ఉపయోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్లకు స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల ప్రకారం శనివారం బీఆర్కేభవన్ నుంచి కొవిడ్ నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఎంహెచ్వోలు, జిల్లా, ఏరియా దవాఖానల సూపరింటెండెంట్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కొవిడ్ పరిస్థితిని ఎదురొనేందుకు ఆక్సిజన్ సౌకర్యంతో అదనంగా 12 వేల పడకలను సత్వరమే ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈ పనిని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు. రోగులకు మెరుగైన సేవలందించడానికి కరోనా కేర్ సెంటర్ (సీసీసీ)లను ఉపయోగించుకోవాలని సూచించారు. తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న రోగులను ఈ కేంద్రాల్లో చేర్పించి, చికిత్స అందించాలన్నారు. దవాఖానకు వచ్చిన ప్రతి రోగికి సకాలంలో సరైన వైద్యచికిత్స అందేలా చూడాలని చెప్పారు. కొవిడ్ పరిస్థితిని అంచనావేయడానికి, సేవలను బలోపేతంచేయడానికి డీఎంహెచ్వోలు, దవాఖానల సూపరింటెండెంట్లు, ఆర్ఎంవోలు, ఇతర సంబంధిత అధికారులతో రోజుకు రెండుసార్లు మినీ టెలికాన్ఫరెన్స్లు నిర్వహించాలని ఆదేశించారు. కొవిడ్ నియంత్రణ చర్యలు, చికిత్స విధుల్లో ఇతర విభాగాల సిబ్బందిని తీసుకొనేందుకు, అవసరమైతే తాతాలిక ప్రాతిపదికన సిబ్బందిని నియమించడానికి జిల్లా కలెక్టర్లకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఒక్క యూనిట్ ఆక్సిజన్ వృథా కావొద్దు
అన్ని వైద్యశాలల్లో తగినంత వైద్య ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. ఈ సమయంలో విలువైన ఆక్సిజన్ను సక్రమంగా వినియోగించాల్సిన అవశ్యకతను గుర్తించాలని సూచించారు. ఒక యూనిట్ ఆక్సిజన్ కూడా వృథా కావొద్దని నొక్కి చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఆక్సిజన్ను ఏవిధంగా ఎంతమేరకు సమర్థంగా వినియోగిస్తున్నామనే దానిపైనే కొవిడ్ నియంత్రణ ఆదారపడి ఉన్నదన్నారు.
కొవిడ్ వార్డులుగా ఖాళీ వార్డులు
జిల్లాల్లో ఉన్న దవాఖానల్లో వసతులతో ఉన్న ఖాళీ వార్డులను కొవిడ్ వార్డులుగా మార్చి, ఆయా పడకలకు ఆక్సిజన్, ఐసీయూ వెంటిలేటర్ల సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్లను సోమేశ్కుమార్ ఆదేశించారు. తద్వారా దవాఖానల్లో ఎకువమంది రోగులను చేర్చుకోవచ్చునని తెలిపారు. బోధన వైద్యశాలల్లో లభించే అన్ని మౌలిక సదుపాయాలు, మానవ వనరులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్లతోపాటు వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, స్టాంపులు, రిజిష్ట్రేషన్ల సీఐజీ శేషాద్రి, ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమీషనర్ రఘునందన్రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, ఎక్సైజ్శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డ్రగ్ కంట్రోల్ అడ్మినిష్ట్రేషన్ డైరెక్టర్ ప్రీతి మీనా, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్రావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్రెడ్డి, ఆరోగ్యశాఖ సలహాదారు గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి, టీఎస్ఐఐసీ ఎండీ నరసింహారెడ్డి పాల్గొన్నారు.