హైదరాబాద్ : నగరంలోని ఎస్సార్నగర్ పీఎస్ పరిధిలో భారీ దొంగతనం జరిగింది. రాజీవ్నగర్లోని శ్రీసాయి నివాస్ ప్లాట్ నంబర్ 301లో ఎంవీసీ శేఖర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఈ నెల 10న ఉదయం 10 గంటలకు ఆయన బంధువులు మరణించగా.. అంత్యక్రియల కోసం ప్రకాశం జిల్లాకు కుటుంబంతో సహా వెళ్లారు. గురువారం తిరిగి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో ప్లాట్ మెయిన్ డోర్ తెరిచి ఉండడం గమనించారు.
వెంటనే లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో బంగారం, నగదు కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ నెల 12న అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడి కేజీ బంగారం, రూ.22లక్షల నగదు, చోరీకి గురైనట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.