కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 27: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో తుపాకుల మోతమోగింది. మావోయిస్టులు, భద్రతాదళాల మధ్య సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందా రు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. ఈ ఆపరేషన్ను ఛత్తీస్గఢ్-తెలంగాణ బలగాలు సంయుక్తంగా నిర్వహించాయి. వివరాల్లోకి వెళ్తే.. కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని పెసళ్లపాడు అటవీప్రాంతంలో స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్, సుక్మా డీఆర్జీ, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో మావోయిస్టులు జవాన్లకు తారసపడ్డారు. మావోయిస్టులు కాల్పులు ప్రారం భించడంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులకు దిగారు. 15 నిమిషాల భీకరపోరు జరిగింది. మావోయిస్టులు దట్టమైన అటవీప్రాంతంలోకి పారిపోయారు. అనంతరం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఘటనా స్థలంలో ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. మూడు 303 రైఫిళ్లు, నాలుగు డీబీబీఎల్లు, ఐదు రాకెట్ లాంచర్లతోపాటు ఇతర పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్దత్ ధ్రువీకరించారు.