పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల సమరం ముగియడంతో అధికార యంత్రాంగం అభివృద్ధి పనులపై దృష్టి సారించింది. దాదాపు 36 రోజులపాటు ఎన్నికల కోడ్ ఉండడంతో చాలాచోట్ల నిలిచిన పనులను పరుగు పెట్టించేందుకు చర్యలు ప్రారంభించింది. ప్రతిపాదిత ప్రాజెక్టులను కార్యరూపంలోకి తేవడంతోపాటు పురోగతిలో ఉన్న ఎస్ఆర్డీపీ, రహదారుల అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు నడుంబిగించింది. ఎన్నికల షెడ్యూల్ ముందు గతనెల 11న బల్దియా నూతన పాలకవర్గం కొలువుదీరింది. తొలి సర్వసభ్య సమావేశం నిర్వహణ, బడ్జెట్ ఆమోదానికి కోడ్ అడ్డురావడంతో త్వరలో కౌన్సిల్ భేటీకి సన్నాహాలు చేస్తున్నారు. ఆరుచోట్ల అన్ని హంగులతో పూర్తయిన 1273 ‘డబుల్’ ఇండ్ల ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను వసూలుకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించనున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో అధికార యంత్రాంగం ఇక పాలనపై దృష్టి సారించింది. దాదాపు 36 రోజుల పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో నిలిచిపోయిన అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచే దిశగా సన్నాహాలు చేస్తున్నది. ప్రతిపాదిత ప్రాజెక్టులను కార్యరూపంలోకి తీసుకురావడం, పురోగతిలో ఉన్న ఎస్ఆర్డీపీ, రహదారుల అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటితోపాటు జీహెచ్ఎంసీ నూతన పాలకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించి 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్ ముసాయిదాపై చర్చించాల్సి ఉంది. సమావేశంలో 5600కోట్ల బడ్జెట్ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసి అనుమతి కోసం ప్రభుత్వానికి పంపించాల్సి ఉంది.
అభివృద్ధి పనులు వేగవంతం
ఎస్ఆర్డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్థి పథకం), సమగ్ర రోడ్ల నిర్వహణ పథకం పనులను వేగవంతం చేయాలని, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. వీటితోపాటు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు, నాలాల పూడికతీత, నాలాల ఆధునీకరణ, పచ్చదనం పెంపు, స్వచ్ఛ సర్వేక్షణ్ పనులను వేగిరం చేయనున్నారు. ఆర్యూబీ, ట్రాఫిక్ సిగ్నల్స్ ఆధునీకరణ, వివిధ సదుపాయాల కల్పన, కొత్త ప్రాజెక్టుల రూపకల్పనపై దృష్టి సారించనున్నారు.
ప్రారంభానికి 1273 ఇండ్లు..
నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పంతో గ్రేటర్ పరిధిలో 111 ప్రాంతాల్లో చేపట్టిన లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు లబ్ధిదారులకు విడుతల వారీగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 12 చోట్ల 2478 ఇండ్లను ప్రారంభించగా, తాజాగా మరో ఆరు చోట్ల 1273 ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసింది. సనత్నగర్, ముషీరాబాద్, ఇతర నియోజకవర్గాల పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం జరగాల్సి ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇవి నిలిచిపోయాయి. త్వరలోనే అంబేద్కర్ నగర్ కాలనీలో 400 ఇండ్లు, పొట్టి శ్రీరాం నగర్ 162, సీసీ నగర్ 264, జీవై రెడ్డి 180, ఎస్సీ బోస్ నగర్ 60, చిక్కడపల్లి దోబీఘాట్లో 207 ఇండ్లు ప్రారంభించనున్నారు.
ఆస్తి పన్ను వసూళ్లపై ఫోకస్
మరో తొమ్మిది రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం రూ.1900కోట్ల లక్ష్యంలో రూ.1470కోట్ల మేర మాత్రమే జీహెచ్ఎంసీ రాబట్టుకున్నది. వరుస ఎన్నికలు, భారీ వరదలు పన్ను వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలోనే మొండి బకాయిదారులకు 90శాతం వడ్డీ నుంచి మినహాయింపునిస్తూ అవకాశమివ్వగా రూ.260కోట్ల మేర వసూళ్లను రాబట్టుకున్నది. నె లాఖరు వరకు ఓటీఎస్ అందుబాటులో ఉండటంతో ఈ ప థకాన్ని సద్వినియోగం చేసుకునేలా విస్తృత అవగాహన చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. స్పెషల్ డ్రైవ్లు చేపట్టి ఆస్తిపన్ను వసూళ్లను పెంచుకోవాలని భావిస్తున్నారు.