హైదరాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ): బోనాలు, బక్రీద్ పండుగల వేళ ప్రజలు కొవిడ్ పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ హెచ్చరించింది. పోతరాజులు, పూజారులు, మాతంగి, ఇతర సిబ్బంది సహా ప్రతి ఒక్కరూ కచ్చితంగా సరైన మాస్కులు ధరించాలని సూచించింది. తరుచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, నిర్ణీతదూరం పాటించాలని స్పష్టంచేసింది. కొన్ని జిల్లాల్లో ఇంకా కేసులు నమోదవుతున్న తరుణంలో నిర్లక్ష్యం తగదని హెచ్చరించింది. కరోనా తొలగిపోలేదని, ప్రజలు సహకరించినప్పుడే థర్డ్వేవ్ను అడ్డుకోవడం సాధ్యమవుతుందని పేర్కొంది. జలుబు, దగ్గు, తలనొప్పి, ఒంటినొప్పులు, గొంతునొప్పి, రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్లో ఉండాలని, కొవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని సూచించింది. పాజిటివ్ వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని పేర్కొంది. కొవిడ్పై ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రజారోగ్యశాఖ సంచాలకుడు జీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.