ఒకనాడు వలస కూలీల వెతలు మారుమోగిన పాలమూరు పల్లెల్లో నేడు పసిడి రాసులు పొంగిపొర్లుతున్నాయి. ఆనాడు బతుకుదెరువు వెతుక్కుంటూ పట్నాలకు పోయి, మూటలు మోసిన అన్నదాతలు.. నేడు సొంతూళ్లకు తిరిగి వచ్చి.. తలెత్తుకుని.. వరిధాన్యం బస్తాలు లారీలకు ఎక్కిస్తున్నారు. నీటి చుక్కకు అల్లాడిన పంట పొలాలు.. రాష్ట్ర ప్రభుత్వ జల సంకల్పంతో చుట్టుముట్టిన నీటి వనరులతో మురిసి పోతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో యాసంగిలో 5,77,662 ఎకరాల్లో వరి సాగు చేయగా, 10,03,847 టన్నుల ధాన్యం దిగుబడిని అంచనావేశారు. ఇటీవలే కొనుగోళ్లు మొదలుకాగా.. ఇప్పటికే 1,25,289 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. శనివారం విక్రయానికి తెచ్చిన ధాన్యంతో మహబూబ్నగర్ మార్కెట్ యార్డు ఇలా నిండిపోయి కనిపించింది.