పెద్దపల్లిటౌన్, జూన్ 24: అడవి బాటను వీడి జనజీవన స్రవంతిలో కలిసే మావోయిస్టుల పట్ల మానవత్వంతో సహకరిస్తామని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శివాలయం వీధీలోని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్రావు ఇంటికి వెళ్లిన సీపీ.. ఆయన తల్లి మల్లోజుల మధురమ్మను కలిసి పండ్లు, దుస్తులు అందజేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన మల్లోజుల వేణుగోపాలరావు, మల్లా రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాద్రావు తదితర అగ్రనేతలు అనారోగ్యంతో ఉంటే మెరుగైన వైద్య సదుపాయం కల్పిస్తామన్నారు. కరోనా బారినపడ్డ వారికి చికిత్స చేయించి, ప్రభుత్వం నుంచి వచ్చే నజరానాలను వారి కుటుంబ సభ్యులకు అందిస్తామన్నారు.
ముంపు భూమి ఇప్పించండి..
ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కోల్పోయిన ఎనిమిదెకరాల భూమిని తిరిగి ఇప్పించాలని మల్లోజుల మధురమ్మ సీపీ సత్యనారాయణను కోరారు. కొడుకు వేణుగోపాల్రావు ఇంటికి తిరిగి రావాలని వేడుకుంది.