ములుగు : జిల్లాలోని పామునూరు అటవీ ప్రాంతంలో నిన్న మావోయిస్టు మిలీషియా సభ్యుడిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతన్ని ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టారు. పోలీసులపై బాంబు దాడులు జరిపేందుకు పామునూరు అటవీ ప్రాంతంలో కుట్ర జరుగుతోందని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో శనివారం సాయంత్రం 7 గంటల సమయంలో పోలీసు బలగాలు పామునూరు అటవీ ప్రాంతం వైపు వెళ్లాయి. కూంబింగ్ నిర్వహిస్తుండగా ఆదివారం ఉదయం 11 గంటలకు రోడ్డుపై బాంబులు అమర్చుతున్న కొంతమందిని పోలీసులు గమనించారు.
అప్రమత్తమైన బలగాలు.. వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించగా అందరూ తప్పించుకున్నారు. ఒకర్ని మాత్రమే పోలీసులు పట్టుకోగలిగారు. అతన్ని అదే రోజు సాయంత్రం 4 గంటలకు వెంకటాపురం పీఎస్కు తరలించారు. అదుపులోకి తీసుకున్నవ్యక్తిని వెంకటాపూరం నూగూరు మండలంలోని జల్లా గ్రామానికి చెందిన మడవి భూదు(40)గా పోలీసులు గుర్తించారు. భూదు నుంచి కార్డెక్స్ వైర్(40 మీటర్లు), నాలుగు డిటోనేటర్లు, ఒక వాకీ టాకీ, 2 ప్రెషర్ కుక్కుర్ బాంబులు, 2 టిఫిన్ బాక్స్ బాంబులు, రెండు ఎలక్ర్టిక్ వైర్ కట్టలు, బ్యాటరీలతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.