డిజిటల్ యుగంలో సాయుధ విప్లవానికి తావులేదు: డీజీపీ
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు నేత, ప్లాటూన్ పార్టీ కమిటీ (పీపీసీ) సభ్యుడు రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ డీజీపీ మహేందర్రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ వివరాలను డీజీపీ బుధవారం మీడియాకు వెల్లడించారు. రావుల రంజిత్ తల్లిదండ్రులిద్దరూ మావోయిస్టులేనని చెప్పారు. తండ్రి రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న 2019లో అనారోగ్యంతో మరణించారని, తల్లి సావిత్రి అలియాస్ సుశీల ప్రస్తుతం కిష్టారం ఏరియా డీవీసీఎంగా ఉన్నారని తెలిపారు. మారుతున్న సమాజంలో విప్లవ భావాలకు తావులేదని తెలుసుకున్న రంజిత్ లొంగిపోయాడని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. మావోయిస్టులు మారాలని, ప్రజలే కేంద్రంగా పాలిస్తూ, ప్రజల అవసరాలను తీరుస్తున్న ప్రభుత్వాలపై తిరుగడబటంలో అర్థం లేదని పేర్కొన్నారు. రంజిత్కు రూ.4 లక్షల ఆర్థికసాయంతోపాటు తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు అందజేస్తున్నామని చెప్పారు. తెలంగాణను మావోయిస్టులు లేని రాష్ట్రంగా మార్చాలన్నదే తమ లక్ష్యమని మహేందర్రెడ్డి తెలిపారు. డిజిటల్ యుగంలో సాయుధ విప్లవం, ప్రభుత్వాలపై తిరుగుబాటు వంటి భావాలకు తావులేదన్నారు. మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) జితేందర్, ఇంచార్జి ఐజీ (ఇంటెలిజెన్స్) ప్రభాకర్రావు తదితరులు పాల్గొన్నారు.