హైదరాబాద్ : ”మొన్నటి వరకు సీఎం కేసీఆర్ పక్కన అధికారాన్ని అనుభవించిన ఈటల రాజేందర్ తన ఆస్తుల పెంపుదలకు ప్రయత్నించాడు. అందులో భాగంగా పేదల భూములను అక్రమంగా ఆక్రమించాడు. తెలంగాణలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తాం అని ప్రకటిస్తూ తన ఆస్తుల రక్షణ కోసం నేడు బీజేపీలో చేరారని” తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ అన్నారు.
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటెల రాజేందర్ తీరు, వ్యవహార శైలిపై తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఘాటు లేఖ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను తెలంగాణ మావోయిస్టు పార్టీ ఖండిస్తున్నట్లు తెలిపారు. ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడతానని అందుకోసం ఆర్ఎస్ఎస్ నుండి పోరాడాలని ప్రకటన చేసి హిందూత్య పార్టీ అయినా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారన్నారు.
కేసీఆర్కు ఈటల రాజేందర్కు మధ్య జరుగుతున్న విషయం ఇది. తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం కాదన్నారు. అధికారంలో కొనసాగినంతకాలం ఈటల రాజేందర్ గొర్రెలు తినే ఆచరణను కొనసాగించాడరన్నారు. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్, ఆర్ ఎస్ యు మావోయిస్టులు కూడా తనకు మద్దతు ఇస్తారని ఈటల చెప్పుకోవడం పచ్చి మోసమన్నారు. ఈటల నిర్ణయాన్ని తెలంగాణలోని ప్రజలు ప్రజాస్వామిక వాదులు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ హిందూత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా దేశంలో విశాల ప్రజలు ఐక్యమై పోరాడుతున్నట్లు జగన్ పేర్కొన్నారు.