తొలకరితో చిగురిస్తున్న ఆశలు
జిల్లాలో 4 లక్షల 51 వేల ఎకరాల్లో పంటలు..
అంచనా వేసిన వ్యవసాయ అధికారులు
కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/బెజ్జూర్, జూన్ 7:జిల్లాలో వానకాలం సాగుకు.. రైతులు సిద్ధమవుతున్నారు. జూన్ ప్రారంభం నుంచే తొలకరి పలకరించడంతో ఏరువాక పనులు మొదలుపెట్టారు. ఇప్పటికే కొన్ని చోట్ల భూములను సిద్ధం చేసుకోగా, మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పనులు షురూ చేశారు. ఈ ఏడాది 4 లక్షల 51 వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలు కూడా అనుకూలంగా ఉంటాయని వాతావరణ శాఖ చెబుతుండడం.. ప్రభుత్వం రైతు బందు కూడా అందించనుండడంతో కావాల్సిన ఎరువులు, విత్తనాలు తీసుకోనున్నారు.
జిల్లాలో వానకాలం సాగు పనులు ప్రారంభమయ్యాయి. తొలకరి పలుకరించడంతో దుక్కి దున్ని సాగుకు సమాయత్తమవుతున్నారు. గతేడాది నియంత్రిత పద్ధతిలో పంటలు సాగుచేయాలని సూచించిన సర్కారు.. ఇప్పుడు తమకు నచ్చిన పంటలు పండించవచ్చని తెలిపింది. ఈ నెల 15వ తేదీ నుంచి రైతుబంధు అందించనుండడంతో అవసరమైన ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయనున్నారు. కాగా, పంటల సమాచారాన్ని వ్యవసాయ అధికారులు సేకరించారు.
సాగు వివరాలు..
ఈ ఏడాది 3 లక్షల 35 వేల ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది కంటే 25 వేల ఎకరాల సాగు తగ్గనున్నది. అలాగే 60 వేల ఎకరాల్లో పండిన వరి.. ఈ ఏడాది 5,400 ఎకరాలు తగ్గనున్నట్లు అంచనా వేశారు. కంది 46,096 ఎకరాలు, పెసర 3,017 ఎకరాల్లో, జొన్న 29,062 ఎకరాలు, సోయా 1564 ఎకరాల్లో సాగవనున్నది. మిగతా ఇతర పంటలు సాగు చేయనున్నారు.
అందుబాటులో 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా..
వానకాలం పంటల కోసం ఏ మేరకు ఎరువులు అవసరమవుతాయో అధికారులు అంచనా వేశారు. 46 వేల మెట్రిక్ ట న్నుల యూరియా, 23 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువు లు, 23 వేల మెట్రిక్ టన్నుల డీఏపీ, 23 వేల మెట్రిక్ టన్నుల పొటాస్, 23 వేలు మెట్రిక్ టన్నుల ఇతర ఎరువులు అవసరమని భావిస్తున్నారు. కాగా, జిల్లాలో ప్రస్తుతం 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
బెజ్జూర్లో..
బెజ్జూర్లో 22,851 ఎకరాల్లో పత్తి, 7,661 ఎకరాల్లో వరి, 757 ఎకరాల్లో కంది, 41 ఎకరాల్లో పెసర, 163 ఎకరాల్లో సోయా సాగుకు రైతులు సిద్ధమైనట్లు వ్యవసాయ అధికారి రాజులనాయుడు తెలిపారు. మరో వైపు పీఏసీఎస్లో ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచినట్లు సీఈవో సంజీవ్ చెప్పారు. యూరియా 15 వేల బస్తాలు, డీఏపీ (20-20) 12 వేల బస్తాలతో పాటు వరి విత్తనాలు తెలంగాణ సోనా 200 బ్యాగులు, ఎంటీయూ (1010) రకం 100 బ్యాగులు పంపిణీకి సిద్ధంగా ఉంచారు.