బోధన్, సెప్టెంబర్ 9: భారీ వర్షాలకు మంజీర నదికి ఎగువ నుంచి వస్తున్న వరదకు తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులో బోధన్ మండలం సాలూర వద్ద వందేండ్లనాటి పురాతన వంతెన కొట్టుకుపోయింది. భారీ వరద తాకిడికి ఈ వంతెన ధ్వంసం కావడం, మూడున్నర దశాబ్దాల క్రితం ఈ వంతెనకు సమాంతరంగా నిర్మించిన కొత్త వంతెనకూ పగుళ్లు ఏర్పడటంతో రెండు రాష్ర్టాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు రోజులుగా ఈ పాత వంతెన పైనుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. గురువారం ఉదయం వరద ఉధృతి తగ్గడంతో వంతెన కొట్టుకుపోయిన విషయం వెలుగుచూసింది. మంజీర నదిపై ఈ వంతెనను 1930 దశకం ప్రారంభంలో ఏడో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో నిర్మించారు. మంజీర నదికి ఏ మాత్రం వరద వచ్చినా ఈ వంతెన పైనుంచి వరద నీటి ప్రవాహం ఉంటుంది. ఇది లోలెవల్ వంతెన కావడంతో దీనికి ప్రత్యామ్నాయంగా 1986లో మరో భారీ వంతెన నిర్మించారు. కొంతకాలం క్రితం కొత్త వంతెనకు బీటలు పడటంతో భారీ వాహనాలు పాత వంతెన మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పాత వంతెన ధ్వంసం కావటంతో రెండు రాష్ర్టాల మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.