హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ప్రఖ్యాత వేదశాస్త్ర పండితుడు, వేద విద్యావ్యాప్తికి అంకితభావంతో కృషిచేసిన మహనీయుడు బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజులు అస్తమించారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 81 ఏండ్లు. సోమవారం తెల్లవారుజామునే సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించిన ఆయన శ్రీ బ్రహ్మానంద తీర్థ మహాస్వామిగా దీక్షానామం పొందారు. విధివశాత్తు సాయంత్రమే పరమపదించారు. సన్యాసాశ్రమం స్వీకరించడానికి ముందు తాను నిష్క్రమించే సమయం ఆసన్నమైనదని శిష్యులతో చెప్పడం ఆయన దివ్యదృష్టికి నిదర్శనం. వేద విద్యావ్యాప్తి కోసం కృషిచేసినవారిలో భారతదేశంలోనే మాణిక్య సోమయాజులు అగ్రగణ్యులు. చతుర్వేదాలకు భాష్యం చెప్పగల పాండిత్యం ఆయన సొంతం.
ఆరు దశాబ్దాలుగా వేద విద్యాదానం
వేద పాఠశాలలను నెలకొల్పి వందల శిష్యులకు ఆరు దశాబ్దాలుగా ఆయన వేద విద్యాదానం చేశారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి క్షేత్రంలో కూడా మూడేండ్లపాటు వేద విద్యార్థులను తీర్చిదిద్దారు. ఆ సమయంలో తెలంగాణ నుంచి కాశీక్షేత్రానికి వెళ్లే భక్తుల కోసం దాతల విరాళాలతో కేదార్ఘాట్లో 400 గజాల స్థలాన్ని సేకరించారు. గంగాతీరంలో భూదానం కార్యక్రమం నిర్వహించి, కొన్నాళ్ల క్రితం తిరిగొచ్చారు. 2015లో నిర్వహించిన అయుత చండీయాగం సందర్భంగా ఆయనను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్వర్ణకంకణంతో సత్కరించారు. 2018లో ఆయనకు ముఖ్యమంత్రి పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అప్పటి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా ఆయనకు విశిష్ట సేవా పురస్కారాన్ని ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వేదవిద్యా వికాసం కోసం చేసిన కృషికిగాను ఆయనకు వందలాది సన్మానాలు, సత్కారాలతో గుర్తింపు లభించింది. సోమయాజులు అస్తమయంతో రాష్ట్రం గొప్ప వేదమూర్తిని కోల్పోయింది.
ధార్మిక ప్రవచనాలలో దిట్ట
వేదాల్లోని విశిష్టతను వివరిస్తూ, అనర్గళంగా ధార్మిక ప్రవచనాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణలో వైదిక సంప్రదాయ విద్యలు అడుగంటిపోయిన సమయంలో కన్నతల్లి పట్టుదల, ప్రేరణ, కృషితో వేదవిద్యను అభ్యసించి, విశిష్టస్థానాన్ని అలంకరించారు. పట్లూరు సోమయాజీ అనే పేరుతో ప్రసిద్ధులైన ఆయన జీవితం ఈనాటి వేద విద్యార్థులకు, శాస్త్ర విద్యార్థులకు ఆదర్శప్రాయం. ఆయన పూర్వికులందరూ వేద విద్యా పారంగతులే కావడం విశేషం. ముత్తాత గంగాధర దీక్షితులు, తాత రామకృష్ణ సోమయాజి, తండ్రి పురుషోత్తమ సోమయాజి సంప్రదాయ వేదవిద్యను అధ్యయనం చేసినవారే. పురుషోత్తమ సోమయాజి, జానాబాయి దంపతులకు 13వ సంతానంగా జన్మించిన మాణిక్య సోమయాజులు శిశుప్రాయంలోనే తండ్రిని కోల్పోయారు. తల్లి జానాబాయి తనయులను సంప్రదాయ వేదవిద్యలో నిష్ణాతులుగా తీర్చిదిద్దారు.