ఏమా ప్రకృతి సౌందర్యం.. ఏమా ఒంపుసొంపులు.. చుట్టూ పచ్చని కొండలు.. మధ్యలో జలాశయం.. దాని మధ్యలో మరో ద్వీపం.. ఆ పక్కనే అమ్మవారి ఆలయం.. కవుల వర్ణనకే చిక్కని రమణీయతా! ఇది. అహో! అద్భుతం. బీటలువారిన నేల కాళేశ్వరం నీళ్లతో నాట్యం చేస్తుంటే, మట్టి దిబ్బలు పచ్చని గుట్టలుగా విలసిల్లుతుంటే చూడ్డానికి రెండు కండ్లు సరిపోవు. ఎస్సారార్, అన్నపూర్ణ, అప్పర్ మానేరు జలాశయాలు చూస్తుంటే మదిలో అదే భావన కలుగుతుంది. ఆ ప్రకృతి సౌందర్యానికి పర్యాటక హంగులు జోడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ మూడు జలాశయాలను టూరిజం కేంద్రాలుగా మార్చేందుకు పర్యాటకశాఖ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది.
కరీంనగర్, జూలై 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రెండు గుట్టల మధ్య పరుచుకున్న అందాల అన్నపూర్ణ.. ఆ పక్కనే జలనిధి మధ్యమానేరు.. దాని పైన ఎగువ మానేరు రిజర్వాయర్.. కాళేశ్వరం జలాలతో నిత్యం కళకళలాడుతున్న ఈ మూడు జలాశయాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అనుమతి ఇవ్వాలని గత నెల 4న రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ను కేటీఆర్ కోరారు. వెంటనే స్పందించిన సీఎం.. స్పెషల్ ఫండ్ కింద నిధులు మంజూరు చేస్తామని వేదికపైనే ప్రకటించారు. శ్రీరాజరాజేశ్వర జలాశయం పరిధిలో 243 ఎకరాలు, అన్నపూర్ణ రిజర్వాయర్ పరిధిలో 240 ఎకరాలు భూమి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు అనువుగా ఉందని సీఎం అప్పుడే చెప్పారు. వెంటనే రంగంలోకి దిగిన రాష్ట్ర పర్యాటక శాఖ ఎక్స్పర్ట్ టీంను పంపించి ప్రతిపాదనలు తయారుచేసింది. పర్యాటకులను ఆకట్టుకునేందుకు ప్రముఖ కన్సల్టెన్సీల సహాయం తీసుకుంటున్నది.
రూ.148 కోట్లతో ప్రతిపాదనలు
మూడు రిజర్వాయర్లను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రాథమిక అంచనాలను సిద్ధం చేసింది. మూడు రిజర్వాయర్ల పరిధిలో పర్యాటక రంగంలో భాగంగా ఏర్పాటు చేయాల్సిన నిర్మాణాలు, రిసార్ట్స్ వంటికి స్థలం గుర్తించడమే కాకుండా ప్రపంచస్థాయి పర్యాటకులను ఆకట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఇందుకు రూ.148.50 కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా వేసింది. వీలైతే మరోసారి నిపుణుల బృందాన్ని సంప్రదించి పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఇంకా ఏమైనా చేయాల్సి ఉంటుందా? అన్న అంశాలను సేకరించాలని రాష్ట్ర పర్యాటకశాఖ భావిస్తున్నది.
శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్ పరిధిలో
70 కోట్లతో ఏర్పాట్లు ఎకో ఫ్రెండ్లీ థీమ్ రిసార్ట్స్, హిల్ టాప్ రెస్టారెంట్లు అడ్వెంచర్ యాక్టివిటీ జోన్, థీమ్ పార్క్ జోన్ రూరల్ ఎక్స్ట్రవాంజా అమ్యూజ్మెంట్ జోన్పార్టీ లాన్స్ ఫెస్టివల్ గార్డెన్స్, ఇతర నిర్మాణాలు
అన్నపూర్ణలో అందాలెన్నో..
రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల సరిహద్దులో ఉన్న అన్నపూర్ణ రిజర్వాయర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటున్నది. పట్నంగుట్ట, నర్సింహగుట్ట మధ్యలో ఈ రిజర్వాయర్ ప్రకృతి అందాలకు నెలవుగా ఉన్నది. కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్నది. పట్నం గుట్ట వద్ద ముత్యాల పోచమ్మ దేవాలయం ఉన్నది. ఈ దేవాలయానికి వెయ్యేండ్ల చరిత్ర ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. పట్నం గుట్టకూ ఓ ప్రత్యేకత ఉన్నది. శాతవాహనులకు సంబంధించి చరిత్ర ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయి.