కమలాపూర్, జూలై 15: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ మాదిగల ద్రోహి అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. గురువారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్లో ఏర్పాటు చేసిన ఎమ్మార్పీఎస్ సభలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ను చీల్చడంతోపాటు ఉద్యమాన్ని అణచివేసే కుట్ర చేసిండని ఆరోపించారు. స్కూటర్పై వచ్చిన ఈటల రాజేందర్ వేల కోట్లు ఎలా సంపాదించాడో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జమ్మికుంటలో చెప్పులు కుట్టే పరిశ్రమ కోసం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 25 ఎకరాలు భూమికోసం వెళ్తే దళితులకు ఏం తక్కువ ఉన్నదని, చెప్పులు కుట్టే పరిశ్రమ ఎక్కడిదే అంటూ అవమానించారన్నారు. వేల కోట్ల డబ్బు సంపాదించాననే అహంకారంతో మాదిగలకు ద్రోహం చేశాడని మండిపడ్డారు. మాదిగ బిడ్డల కోసం ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కట్టియ్యని ఈటల రాజేందర్ రూ.వంద కోట్లతో హైదరాబాద్ శివారులో ఇల్లు కట్టుకున్నాడని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ ఏడేళ్లు గడుస్తున్నా పార్లమెంట్లో బిల్లు పెట్టడం లేదని మంద కృష్ణమాదిగ మండిపడ్డారు.