హుజూరాబాద్ టౌన్, జూలై 8: మాదిగలకు నమ్మక ద్రోహం ఎక్కువగా చేసింది బీజేపీ నాయకుడు ఈటల రాజేందరేనని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మండిపడ్డారు. సొంత తల్లికి, కులానికి ద్రోహం చేసేందుకు కూడా సిద్ధమయ్యారని విమర్శించారు. ఈటలకు పదవిపై, సొంత ఆస్తులు పెంచుకోవడంపై ఉన్న మక్కువ.. మరేదానిపై లేదని అన్నారు. అలాంటి వ్యక్తి నేడు పదేపదే ఆత్మగౌరవం అని మాట్లాడతుండటంతో ఆ పదమే సిగ్గు పడుతున్నదని ఎద్దేవాచేశారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో ఎమ్మార్పీఎస్ జెండా గద్దెను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మంద కృష్ణ మాట్లాడుతూ.. బీజేపీ నేత ఈటల రాజేందర్ ఓటర్లను రేటు పెట్టి కొనేందుకు సిద్ధంగా ఉన్నారని, రూ.50 కోట్ల నుంచి రూ.100కోట్లు పెట్టేందుకు కూడా వెనుకాడరని ఆరోపించారు. మాదిగ ఉద్యమాన్ని చీల్చడానికి కుట్ర చేశారని మండిపడ్డారు.
జమ్మికుంటలో చెప్పులు తయారుచేసే పరిశ్రమకు రూ.25 లక్షలు కేటాయించాలని ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈటలను అడిగితే చెప్పులు కుట్టుకునే వృత్తిని ఎవరు పట్టించుకుంటారని, లాభాలు లేని వృత్తి అంటే అది చెప్పులు కుట్టే పనే కదా..? అని ఎగతాళి చేశారని మంద కృష్ణ ధ్వజమెత్తారు. లిడ్ క్యాప్ పరిశ్రమ కోసం రూ.25 లక్షలు కాదు కదా రూ.25 కూడా ఖర్చు పెట్టలేని ఈటల.. ఇవాళ ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎమ్మార్పీఎస్కు అండ దండగా ఉంటానని, వందల వేలసార్లు హామీ ఇచ్చిన ఈటల.. సొంత రాష్ట్రంలో మంత్రి అయ్యాక కనీసం అండగా ఉండకపోగా విలువ ఇవ్వలేదని వాపోయారు. బడుగు బలహీనవర్గాలకు ఎక్కువగా ద్రోహం చేసిన వ్యక్తిగా ఈటల చరిత్రలో నిలిచిపోతారని మండిపడ్డారు. ఆయన అక్రమ ఆస్తులకు బినామీగా పెట్టుకునేందుకు ఎస్సీలు, బీసీలు కనిపించలేదని, ఓసీలనే పెట్టుకున్నారని ఆరోపించారు. ఆయన ఒక్కడే బీసీ అని, ఆయన భార్య, కొడుకు, కూతురుకు రెడ్డి పేర్లే ఉంటాయని, పిల్లలకు రెడ్డి సంబంధాలే చేశారని మండిపడ్డారు. ఆయనలో ఓసీ తత్వమే కనిపించింది కానీ బీసీ తత్వం కనిపించలేదని అన్నారు. 2004 నుంచి 2014 వరకు రాష్ట్రంలో, కేంద్రంలో ఎక్కడ అధికారంలోకి వచ్చినా వంద రోజుల్లో ఎస్సీల ఏబీసీడీల వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి ఏడేళ్లవుతున్నా వర్గీకరణ ఎందుకు చేయడం లేదని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేయాలని చూస్తున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.