జమ్మికుంట, జూలై 4 : ఎస్సీ సబ్ప్లాన్ నిధులను సక్రమంగా ఖర్చు చేస్తున్నది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మందకృష్ణ కేవలం ఉనికి కోసమే రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించగా, ముఖ్యఅతిథులు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, దయానంద్, రాష్ట్ర టూరిజం, హస్తకళల చైర్మన్లు శ్రీనివాస్ గుప్తా, సంపత్కుమార్, నిజామాబాద్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, తదితరులతో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులు మానవత్వానికి ప్రతీకలని కొనియాడారు. ఆర్యవైశ్యులకు అండగా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని మండిపడ్డారు. మతం పేరిట రాజకీయం చేస్తున్నదని ఆరోపించారు.